కడపలో టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్-అప్రమత్తమైన జగన్- ఎల్లుండి సొంత జిల్లాకు పయనం
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం వైసీపీ హవా నడుస్తోంది. భారీ మెజారిటీతో సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీ మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంది. మరో రెండేళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో పాటు మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నారు. కానీ రాష్ట్రంలో పలుచోట్ల పరిస్ధితులు అంత అనుకూలంగా కనిపించడం లేదు. ముఖ్యంగా సొంత జిల్లా కడపలో కీలక నేతలు టీడీపీలోకి ఫిరాయించేందుకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ అప్రమత్తమయ్యారు

కడపలో మారుతున్న రాజకీయం
వైఎస్ కుటుంబానికి కంచుకోట అయిన కడప జిల్లాలో పరిస్ధితులు మారుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య, అనంతర పరిణామాలు, ప్రభుత్వంపై వ్యతిరేకత, జిల్లాలో నేతల్ని జగన్ సీఎం అయ్యాక అంతగా పట్టించుకోవడం లేదన్న ప్రచారంతో రాజకీయం మారుతోంది. ఒకప్పుడు టీడీపీలో ఓ వెలుగు వెలిగి, అనంతరం వైసీపీకి దగ్గరై.. మారిన పరిస్ధితుల్లో జిల్లాలో వైసీపీ, జగన్ నిరాదరణకు గురవుతున్న నేతలంతా తిరిగి సొంతగూటికి చేరేందుకు సిద్దమవుతున్నారు. అదే జరిగితే సొంత జిల్లాలో జగన్ కు ఎదురుదెబ్బలు తప్పకపోవచ్చని తెలుస్తోంది.

టీడీపీలోకి కీలక నేతలు ?
గతంలో టీడీపీ, కాంగ్రెస్ లలో పనిచేసి ఇప్పుడు వైసీపీకి దగ్గరగా ఉంటున్న పలువురు నేతలు త్వరలో ఆ పార్టీతో సంబంధాలు తెంచుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వీరిలో మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులురెడ్డి, వీర శివారెడ్డితో పాటు పులివెందుల నేత సతీష్ రెడ్డి వంటివారున్నట్లు తెలుస్తోంది. వీరంతా అదనుచూసి టీడీపీలో చేరేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే గత ఎన్నికల్లో సాధించిన ఏకపక్ష విజయాలు రిపీట్ చేయడం వైసీపీకి కష్టమేనని తెలుస్తోంది.

కడపపై చంద్రబాబు ఫోకస్
టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గం కుప్పంపై వైసీపీ పూర్తిగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే స్ధానిక ఎన్నికల్లో వరుస విజయాలతో ఊపుమీదున్న వైసీపీని అడ్డుకునేందుకు పులివెందులతో పాటు కడప జిల్లాపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఇదే క్రమంలో కడప జిల్లాలో వరుస పర్యటనలతో పాటు స్ధానిక నేతల్లో ఉన్నవిభేధాల్ని సొమ్ముచేసుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. దీంతో జగన్ కూడా అప్రమత్తమవుతున్నట్లు తెలుస్తోంది. అసలే వివేకా హత్య తర్వాత జిల్లాలో మారిన పరిణామాలకు తోడు చంద్రబాబు ఫిరాయింపుల్ని ప్రోత్సహించేందుకుచేస్తున్న ప్రయత్నాలతో జగన్ సొంత జిల్లాలో టూర్ కు సిద్ధమయ్యారు.

స్వయంగా రంగంలోకి జగన్
కడప జిల్లాలో మారుతున్న పరిస్ధితుల నేపథ్యంలో క్షేత్రస్దాయిలో వాస్తవాల్ని తెలుసుకునేందుకు సీఎం జగన్ సొంత జిల్లాలో పర్యటించబోతున్నారు. ఎల్లుండి తాడేపల్లి నుంచి బయలుదేరి పులివెందుల వెళ్లనున్న జగన్.. అక్కడి నుంచి ప్రొద్దుటూరులో కూడా పర్యటిస్తారు. స్ధానిక నేతల్ని కలుసుకుని తాజా పరిణామాలపై వివరాలు తెలుసుకోనున్నారు. అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై నేతలతో సమీక్షించబోతున్నారు. ఈ టూర్ లో జగన్ టీడీపీలోకి వెళ్లేందుకు సిద్దమవుతున్న నేతల గురించి ఆరా తీయనున్నారు. అలాగే జిల్లాలో అసంతృప్తులపై కూడా దృష్టిపెట్టనున్నారు.
అవసరమైతే వారికి కీలక హామీలు కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications