ఏపీ రోడ్లపై దిశ పెట్రోలింగ్ వాహనాలు పరుగులు: మహిళా పోలీసుల కోసం ప్రత్యేకంగా..!
అమరావతి: రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించే విషయంలో ప్రభుత్వం మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దిశ పథకం కింద దీన్ని అమలులోకి తెచ్చింది. మహిళల రక్షణకు ఉద్దేశించిన 163 దిశ పెట్రోలింగ్ వాహనాలు, 18 కారవాన్లు రాష్ట్రంలో పెట్టాయి. ఈ వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి కిందటే ప్రారంభించారు. అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జెండా ఊపి వాటిని ప్రారంభించారు.

1.16 కోట్ల డౌన్లోడ్స్
పెట్రోలింగ్ వాహనాల కోసం 13.85 కోట్లు, కారవాన్ల కోసం అయిదున్నర కోట్ల రూపాయలను ప్రభుత్వం వ్యయం చేసింది. కోట్లు ఖర్చు చేశారు. శాసన మండలి ఛైర్మన్ కొయ్యె మోషేన్ రాజు, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, డీజీపీ కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వైఎస్ జగన్ ప్రసంగించారు. ఇప్పటిదాకా 1.16 కోట్ల మంది దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారని చెప్పారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో..
మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఇందులో భాగంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీస్ను అందుబాటులోకి తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఇవన్నీ సమాజంలో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టాయని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. మహిళలకు ఎలాంటి అన్యాయం జరిగినా తమ ప్రభుత్వం ఊరుకోదనే సందేశాన్ని దిశ ద్వారా రాష్ట్ర ప్రజలకు చాటి చెప్పామని పేర్కొన్నారు.
మహిళా పోలీసుల కోసం..
మహిళా పోలీసుల కోసమూ పలు చర్యలను తీసుకున్నామని వివరించారు. పోలీస్ స్టేషన్లల్లో ఇప్పటి వరకు మహిళా పోలీసులకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు ఉండేవి కావని, ఆ పరిస్థితిని మార్చామని చెప్పారు. పోలీస్ స్టేషన్లల్లో మహిళా పోలీసుల కోసం సౌకర్యాలను తీసుకొచ్చామని అన్నారు. బందోబస్తు కోసం వెళ్లిన ప్రదేశాల్లో విశ్రాంతి ఇవ్వడానికి ప్రత్యేకంగా కారవాన్లను కొనుగోలు చేశామని వైఎస్ జగన్ చెప్పారు.

18 కారవాన్లు..
మహిళా పోలీసుల కోసమే 18 కారవాన్లను అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. మొత్తంగా 30 కారవాన్లను తాము కొనుగోలు చేశామని, ఇందులో తొలివిడతలో 18 కారవాన్లు అందాయని, వాటిని కూడా ఇప్పుడే ప్రారంభించామని చెప్పారు. మిగిలిన 12 కారవాన్లు త్వరలోనే అందుతాయని పేర్కొన్నారు. మహిళలపై అన్యాయం జరిగితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని వైఎస్ జగన్ హెచ్చరించారు. తక్షణమే వారికి సహాయాన్ని అందజేసేలా సమగ్రమైన, సమర్థవంతమైన నెట్వర్క్ను ఏర్పాటు చేశామని చెప్పారు.

10 నిమిషాల్లో..
ఇప్పటికే దిశ పోలీస్ స్టేషన్లలో 900 ద్విచక్రవాహనాలు ఉన్నాయని, దీనికి అదనంగా మరో మూడువేల అత్యవసర వాహనాలను ప్రారంభిస్తామని అన్నారు. ఈ దిశ పెట్రోలింగ్ వాహనాలు జీపీఎస్ ద్వారా కంట్రోల్ రూమ్కు అనుసంధానమై ఉంటాయని, పట్టణాల్లో అయిదు నిమిషాలు, గ్రామాల్లో 10 నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకునేలా వాటిని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. దిశ యాప్ల డౌన్లోడ్స్.. దీనికి ఉన్న స్పందనను తెలియజేస్తోందని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications