మూగ జీవాలకు ప్రాణం పోసిన జగన్ -రూ.240 కోట్ల ఖర్చుతో ! మోడీ ఫొటో పెట్టి మరీ.
ఏపీలో భారీ ఎత్తున ప్రజలకు సంక్షేమాన్ని అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్ ఇవాళ పశువులకు కూడా ప్రాణం పోసే ఓ కీలక పథకాన్ని ప్రారంభించారు. ప్రధాని మోడీ ఫొటో పెట్టి మరీ ఈ పథకాన్ని జగన్ ప్రారంభించడం ప్రాధాన్యం సంతరించు
ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక భారీ ఎత్తున సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్ని విమర్శలు ఎదురైనా జగన్ సర్కార్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా సంక్షేమంపై రాజీ పడకుండా ముందుకెళుతోంది. ఇదే క్రమంలో పశువుల సంక్షేమాన్ని కూడా కాపాడేందుకు అంతే దీటుగా ముందుకెళుతోంది. ఇదే క్రమంలో ఇవాళ డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్యసేవ పథకం కింద సీఎం జగన్ ప్రత్యేకంగా రూపొందించిన పశువుల అంబులెన్స్ లను ప్రారంభించారు. తాడేపల్లిలో అట్టహాసంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా పశువులకు ఎక్కడికక్కడ ఆరోగ్య సేవలు అందించేందుకు వీలుగా డాక్టర్ వైఎస్సార్ పశు ఆరోగ్య సేవ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.240.69 కోట్ల వ్యయంతో మొత్తం 340 పశువుల అంబులెన్స్లను అందుబాటులోకి తెస్తున్నారు. ఇప్పటికే మొదటి దశలో రూ.129.07 కోట్ల వ్యయంతో 175 పశుఅంబులెన్స్లను ప్రభుత్వం ప్రారంభించింది. వీటి ద్వారా 1,81,791 పశువులను ప్రాణాపాయం నుంచి రక్షించారు. అలాగే 1,26,559 మంది పశు పోషకులకు లబ్ధి చేకూర్చారు.
రెండో దశలో భాగంగా రూ.111.62 కోట్ల వ్యయంతో ఇవాళ మరో 165 పశు అంబులెన్స్ వాహనాలను సీఎం క్యాంపు కార్యాలయం నుంచి జెండా ఊపి ముఖ్యమంత్రి వైయస్.జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్యసేవ వాహనం ఎక్కి పనితీరు, సేవలను స్వయంగా సీఎం పరిశీలించారు. అలాగే ఈ అంబులెన్స్ వాహనాలపై వైఎస్సార్, వైఎస్ జగన్ ఫొటోలతో పాటు ప్రధాని మోడీ ఫొటోను కూడా ఏర్పాటు చేశారు. కేంద్ర నిధులు కూడా వాడుకుని ఈ పథకాన్ని అమలు చేస్తున్నందున ఇలా మోడీ ఫొటో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.