వైసీపీ కార్యకర్తలకు జగన్ గుడ్ న్యూస్?: వైఎస్సార్ జయంతి నాడు ప్రకటన?
YS Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కడప జిల్లా పులివెందుల పర్యటనలో ఉన్నారు. నేడు రెండు రోజు. ఈ సందర్భంగా ఆయన రాయలసీమకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో వరుస సమావేశాలను నిర్వహిస్తోన్నారు. ఓటమికి గల కారణాలపై విశ్లేషిస్తోన్నారు.
పరామర్శ..
8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ఈ పర్యటన తలపెట్టారు. శనివారమే ఆయన పులివెందులకు చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి కడప రిమ్స్లో చికిత్స పొందుతున్న అజయ్ కుమార్ రెడ్డిని పరామర్శించారు.

ప్రజా దర్బార్..
నేడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ సుధ (బద్వేలు), అకేపాటి అమర్నాథ్ రెడ్డి (రాజంపేట) సహా కడప, అన్నమయ్య రాయచోటి, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో జగన్ భేటీ కానున్నారు. ప్రజా దర్బార్ను నిర్వహించనున్నారు.
ఘనంగా వైఎస్సార్ జయంతి..
వైఎస్సార్ జయంతి కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలంటూ ఇదివరకే పార్టీ క్యాడర్కు సూచించారు. పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా వైఎస్సార్ ఆశయాలను కొనసాగించేలా పార్టీపరంగా అన్ని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సేవా కార్యక్రమాలు..
రక్తదాన శిబిరాలు, పాఠశాలల్లో పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ వంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలంటూ పిలుపునిచ్చారు. ఓటమితో డీలా పడ్డ క్యాడర్లో వైఎస్సార్ జయంతి రోజున ఉత్తేజం నింపేలా గ్రామగ్రామాన జెండాలను ఎగురవేయాలని, ఆయన చిత్రపటానికి నివాళి అర్పించాలని కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు.
గుడ్ న్యూస్..
వైఎస్సార్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు జగన్ తీపి కబురు వినిపించే అవకాశం ఉంది. వారికి జీవిత బీమా, ప్రమాద బీమాను ప్రకటిస్తారని తెలుస్తోంది. ఎంత మొత్తం అనేది ఇంకా నిర్ధారణ కాలేదని, 10 లక్షల రూపాయల వరకు బీమా ఉండొచ్చని అంటున్నారు.

ఉత్తేజం నింపేలా..
వాలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులను నమ్ముకుని పార్టీ కార్యకర్తలు, కిందిస్థాయి నాయకులను పట్టించుకోకపోవడం వల్లే మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఓడిపోవడానికి ప్రధాన కారణమనే అభిప్రాయాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని పార్టీ క్యాడర్లో పునరుత్తేజం నింపేలా వారిపై పార్టీపరంగా వరాలు కురిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.
టీడీపీ తరహాలో..
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన విషయం తెలిసిందే. సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకూ రెండు లక్షల రూపాయల మేర ప్రమాద బీమాను అందిస్తోంది. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారి పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించడం, కేరీర్ కౌన్సెలింగ్, గైడెన్స్, వారి పిల్లల పెళ్లికి ఎంతో కొంత సహాయం.. వంటి చర్యలు తీసుకుంటోంది.
సంక్షేమ నిధి?
అదే తరహాలో పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలకు ఆర్థికంగా ఆదుకోవడానికి సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో వైఎస్ జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఎన్నికల తరువాత టీడీపీ దాడుల్లో నష్టపోయిన ప్రతి కార్యకర్తకు ఈ నిధి ద్వారా ఆదుకునేలా ఏర్పాట్లు చేస్తారని సమాచారం.












Click it and Unblock the Notifications