దీక్ష: రామోజీ రావుతో జగన్ భేటీ, అనుమతి ఇచ్చేదిలేదన్న చంద్రబాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఈనాడు సంస్థల గ్రూపు ఛైర్మన్ రామోజీ రావును గురువారం కలిశారు. మర్యాద పూర్వకంగానే రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి రామోజీరావుని కలిశారు. రామోజీ రావుని కలిసేందుకు వెళ్లిన సమయంలో వైయస్ జగన్ వెంట భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఉన్నారు.
అయితే ఈ భేటీ వెనుకు వేరే కారణాలున్నాయని సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఈ నెల 26న గుంటూరులో తలపెట్టిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ దీక్షకు పోలీసుల అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రామోజీరావుతో వైయస్ జగన్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. గుంటూరులో విద్యాసంస్ధలు రద్దీగా ఉంటే ప్రాంతంలో వైయస్ జగన్ దీక్ష చేపడుతున్నారని, ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుందనే ఉద్దేశంతో అనుమతివ్వలేదని పోలీసులు అంటున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పార్టీ యంత్రాంగం పూర్తి చేసింది.
మరో రెండు రోజుల్లో వైయస్ జగన్కు దీక్ష చేయనున్న నేపథ్యంలో తాజాగా ఇప్పుడు దీక్షకు అనుమతి నిరాకరించడంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యంత్రాగం సందిగ్ధంలో పడింది. ప్రభుత్వం కావాలనే దీక్షకు అనుమతి నిరాకరిస్తుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
గుంటూరులోని ఉల్ఫ్ గ్రౌండ్ వద్ద దీక్ష చేయనున్నారు. పోలీసులు అనుమతి నిరాకరించడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, దీక్ష చేయాలనుకున్న ప్రాంతానికి సమీపంలో ఆస్పత్రి, విద్యా సంస్థలు ఉన్నాయని, అలాగే 25న బక్రీద్, 27 వినాయక విగ్రహాల నిమజ్జనం ఉన్నందున అనుమతి ఇవ్వలేమని పోలీసులు స్పష్టం చేశారు.
జగన్ దీక్షకు అనుమతి ఇచ్చేదిలేదన్న చంద్రబాబు
గుంటూరులో ఈనెల 26న వైయస్ జగన్ తలపెట్టిన నిరవధిక దీక్షకు అనుమతి ఇచ్చేదిలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ దీక్ష పేరుతో బస్సులు తగలబెడుతామంటే చూస్తు ఊరుకునేది లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పేరు ప్రఖ్యాతులున్యాయని చెప్పిన సీఎం చంద్రబాబు, రాష్ట్రంలో రౌడీయిజం, గూండాయిజాన్ని పూర్తిగా రూపుమాపుతామని చెప్పారు.