కర్నూలు ఎమ్మెల్యేలతో జగన్ భేటీ, వీరు హాజరు: భూమా ఇంటికి వైవీ
హైదరాబాద్: పార్టీ శాసనసభ్యులు భూమా నాగిరెడ్డి, అఖిలప్రియలతో పాటు మరికొంత మంది పార్టీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలోకి మారుతున్నారనే వార్తల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ నష్టనివారణ చర్యలకు దిగారు. ఆయన కర్నూలు జిల్లా శాసనసభ్యులతో శనివారం ఉదయం సమావేశమయ్యారు.
జగన్మోహన్ రెడ్డితో సమావేశానికి ఎస్వీ మోహన్ రెడ్డి, జయరాం, ఐజయ్య, బుడ్డా రాజశేఖర రెడ్డి హాజరయ్యారు. కాగా, పార్టీ నాయకుడు సజ్జల రామకృష్ణా రెడ్డి మరోమారు భూమా నాగిరెడ్డితో సమావేశమయ్యారు. వైయస్ జగన్మోహన్ రెడ్డితో భూమా నాగిరెడ్డి సమావేశమైన తర్వాత ఆ భేటీ జరిగింది.

ఎట్టి పరిస్థితిలోనూ భూమా నాగిరెడ్డి పార్టీ మారకుండా చూడాలనే ఉద్దేశంతో వైయస్ జగన్ ఉన్నట్లు కనిపిస్తున్నారు. దీంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు, జగన్ సమీప బంధువు వైవి సుబ్బారెడ్డి భూమా నాగిరెడ్డి ఇంటికి చేరుకున్నారు. భూమా నాగిరెడ్డిని బుజ్జగించేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
భూమా నాగిరెడ్డిని పార్టీ మారకుండా చేసుకోగలిగితే కర్నూలు జిల్లా శాసనసభ్యులు కూడా వెనకడుగు వేస్తారనేది జగన్ ఉద్దేశంగా కనిపిస్తోంది. పార్టీ మారవద్దని చెప్పడానికి ఇది వరకే సజ్జల రామకృష్ణా రెడ్డి జగన్ రాయబారిగా భూమా వద్దకు వెళ్లారు.












Click it and Unblock the Notifications