ఎందాకైనా వెళ్తా, అంతిమ లక్ష్యం అదే: బాబును ఏకేసిన జగన్
చిత్తూరు: ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కో పేజీలో ఒక్కో కులానికి హామీలను గుప్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. అధికారంలోకి వచ్చిన తర్వాత అందర్నీ దగా చేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. అంతేగాక, ప్రశ్నించిన వ్యక్తులను 'తోలు తీస్తా, తాట తీస్తా' అంటూ బెదిరిస్తున్నారని మండిపడ్డారు.
Recommended Video

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం పుంగనూర్ నియోజకవర్గం కల్లూరులో నిర్వహించిన మైనార్టీల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ముస్లింలకు ప్రత్యేక సంక్షేమ పథకాలను అందించనున్నట్లు తెలిపారు.

ముస్లింల కోసం సబ్ ప్లాన్
రాబోయే తమ ప్రభుత్వంలో ముస్లింల కోసం సబ్ ప్లాన్ తీసుకొస్తామని జగన్ అన్నారు.
ఇమామ్ లకు రూ. 10 వేలు, మౌసమ్లకు రూ. 5 వేలు అందజేస్తామని చెప్పారు. పేద మైనార్టీ విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలని డిమాండ్ చేశారు.

ఎక్కడ వైద్యం చేయించుకున్నా.. ఆరోగ్యశ్రీ
ఆరోగ్యశ్రీలో మార్పులను తీసుకొస్తామని.. ఇతర ప్రాంతాల్లో వైద్యం చేయించుకున్నవారికి కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తామని చెప్పారు. అంతేగాక, ఆపరేషన్ తర్వాత రెస్ట్ పీరియడ్ లో డబ్బులు అందజేస్తామని చెప్పారు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారికి రూ. 10 వేల పెన్షన్ అందిస్తామని తెలిపారు.

అంతిమ లక్ష్యం అదే..
నవరత్నాల ద్వారా పేదలందరికీ సంక్షేమ పథకాల లబ్ధిని అందజేయటమే తన లక్ష్యమని వైయస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. ‘ఇవాళ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఒక్కటే చెప్పదల్చుకున్నా. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్ర అభివృద్ధి మరుగున పడిపోయింది. ఇలాంటి సమయంలో మనకు కావాల్సింది సమర్థవంతమైన పాలన. రాజకీయాలంటే విశ్వసనీయత కోల్పోయేలా చేసిన వ్యక్తి చంద్రబాబు. నాయకుడు అంటే ఎలా ఉండాలి అంటే గుర్తొచ్చేది దివంగత నేత రాజశేఖర్ రెడ్డి. మహానేత వారసుడిగా ప్రజల శ్రేయస్సు కోసం ఎందాకైనా వెళ్తా. అదే నా అంతిమ లక్ష్యం' అని జగన్ పేర్కొన్నారు.

మన ప్రభుత్వం వస్తే..
‘ప్రతీ దాంట్లోనూ చంద్రబాబు మోసం స్పష్టంగా కనిపిస్తోంది. దేవుడి దీవెనలు, మీ ఆశీర్వాదంతో మన ప్రభుత్వం వస్తే ఏం చేయాలో సలహాలు, సూచనలు తీసుకుంటా. అంతకు ముందు నవరత్నాల ద్వారా వైఎస్సాఆర్సీపీ ఏం ఏం చేయదల్చుకుందో వివరిస్తానని వైయస్ జగన్ అన్నారు. పేదరికంలో ఉన్న వాళ్ల ప్రధాన సమస్యల్లో ఒకటి పిల్లలు చదువు. లక్షల్లో ఫీజులు ఉంటే రీఎంబర్స్మెంట్ పేరిట చంద్రబాబు ప్రభుత్వం ముష్టి వేస్తోంది. పండగలు వస్తే ఆయా మతాల మీద చంద్రబాబు ప్రేమ కురిపిస్తారు. కానీ, నిజమైన ప్రేమంటో నేను చెబుతున్నా విను చంద్రబాబు.. ఎంత ఖర్చైనా సరే పిల్లల చదువులకు భరోసా ఇవ్వటమే అసలైన ప్రేమ. అది నేను అందిస్తా. చదివించటమే కాదు.. వారికి ఖర్చుల కోసం 20 వేల రూపాయలను కూడా అందజేస్తానని జగన్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications