ప్రణబ్కి జగన్ అఫిడవిట్, వస్తుంటే టి షాక్: రాత్రి కెసిఆర్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, పార్టీ ఇతర నేతలు గురువారం ఉదయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ రాష్ట్రపతికి వారు అఫిడవిట్లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రం విడిపోతే ఇరు ప్రాంతాలకు నష్టమని, సమైక్యంగానే ఉంచాలని జగన్ రాష్ట్రపతిని కోరారు. మధ్యాహ్నం ఒకటి గంటలకు జగన్ విలేకరులతో మాట్లాడనున్నారు.
జగన్కు టి షాక్
రాష్ట్రపతిని కలిసి వస్తుండగా వైయస్ జగన్కు తెలంగాణ సెగ తగిలింది. జగన్ కాన్వాయ్ని తెలంగాణవాదులు అడ్డుకొని జై తెలంగాణ అని నినాదాలు చేశారు. తెలంగాణవాదులను జగన్ పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు తెలంగాణవాదులను అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్రపతి బిజీబిజీ
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రానికి వచ్చినప్పటి నుండి బిజీగా ఉన్నారు. విభజన నిర్ణయం నేపథ్యంలో ఇరు ప్రాంతాలకు చెందిన పలువురు నేతలు ఆయనను వరుసగా కలుస్తున్నారు. గురువారం ఆయన మరింత బిజీగా మారిపోయారు. ఉదయం వైయస్ జగన్ పార్టీ ఇతర నేతలతో కలిసి సమైక్యం కోసం విన్నవించారు.
మధ్యాహ్నం ఒకటి గంటలకు కాంగ్రెసు పార్టీ ఎంపి అజహరుద్దీన్, ఒకటిన్నరకు కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిలు కలవనున్నారు. పురంధేశ్వరి రాష్ట్రపతిని కలిసి తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా లేఖ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రాత్రి ఎనిమిది గంటలకు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కలువనున్నారు. ఆయనతో ముప్పై మందికి పైగా నాయకులు భేటీలో పాల్గొంటారు.
29న సీమాంధ్ర నేతలు
ఈ నెల 29వ తేదీన సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు నేతలు హైదరాబాదులో ప్రణబ్ను కలవాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లు అసమగ్రంగా ఉందని, విభజనకు సహకరించవద్దని కోరనున్నారు.