ఢిల్లీలో ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ- తర్వాత నిర్మలాసీతారామన్ తో -ఆర్ధికాంశాలే కీలకం
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన సీఎం జగన్ మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకున్నారు. అధికారిక నివాసం వన్ జన్ పథ్ కు చేరుకున్న అనంతరం ప్రధాని మోడీతో భేటీకి బయలుదేరి వెళ్లారు.
సాయంత్రం నాలుగు గంటల తర్వాత సీఎం జగన్ ప్రధాని మోడీ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. మోడీతో రాష్ట్రానికి సంబంధించి పలు కీలక సమస్యలపై ఆయన చర్చలు జరిపారు. ఇందులో పోలవరం నిర్మాణంతో పాటు వివిధ ఆర్ధిక అంశాలు, అప్పులు, తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలు వంటి అంశాలపై జగన్ చర్చించారు. అలాగే ముందస్తు ఎన్నికలపైనా రాష్ట్రంలో ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజా పరిణామాలపైనా ప్రధానితో జగన్ మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీ టూర్ లో భాగంగా సీఎం జగన్ ప్రధాని మోడీతో భేటీ తర్వాత ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ఇవాళ భేటీ కానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీకి కూడా జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రక్రియ నిలిచిపోయిన నేపథ్యంలో దీనిపై అమిత్ షాతో చర్చలు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రాష్ట్రానికి చెందిన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఇతర కేంద్రమంత్రులతో కూడా జగన్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయా మంత్రుల అపాయింట్ మెంట్ల కోసం ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications