జగన్ పాదయాత్ర వాయిదా?...10న పున:ప్రారంభం!: 5 వ తేదీన రాష్ట్రపతిని కలవనున్న వైసిపి బృందం
హైదరాబాద్:ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాద యాత్ర ముందు ప్రకటించిన ప్రకారమైతే నవంబర్ 3 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఆయనపై జరిగిన హత్యాయత్నం ఘటనలో భుజానికి అయిన గాయం పూర్తిగా మానేందుకు మరో వారం రోజులైనా విశ్రాంతి అవసరమని తెలిసింది.
ఈ నేపథ్యంలో రేపటి నుంచి మొదలవ్వాల్సిన పాదయాత్ర వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. నవంబర్ 10నుంచి పాదయాత్రను పున:ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే షెడ్యల్ ప్రకారం జగన్ పాదయాత్ర శనివారం నుంచి మళ్లీ ప్రారంభం అవుతుందనే ఉద్దేశ్యంతో విశాఖకు రానున్న జగన్ కు ఘనస్వాగతం పలికేందుకు వైసిపి శ్రేణులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేసుకున్నాయి. మరోవైపు 5 వతేదీన రాష్ట్రపతిని వైసిపి బృందం కలవనుంది.

తనపై జరిగిన దాడిలో ఎడమ భుజానికి అయిన గాయం పూర్తిగా మాననందువల్ల జగన్ పాదయాత్ర వాయిదా పడినట్లు తెలిసింది. జగన్ భుజం కొద్దిగా వాయడంతో గాయాన్ని పరిశీలించిన వైద్యులు కుట్లు ఇంకా పూర్తిగా మానలేదని...గాయం మానే దశలో పాదయాత్ర కదలికల వల్ల మళ్లీ గాయం మరింత రేగే అవకాశం ఉంటుందని తెలిపారట.
అందువల్ల పాదయాత్ర వాయిదా వేసుకోవాలని వైద్యులు సూచించారని తెలిసింది. గాయం పూర్తిగా మానేందుకు మరో వారం అయినా పడుతుందని వైద్యులు తెలిపిన నేపథ్యంలో జగన్ పాదయాత్ర ఈ నెల 10వ తేదీ పున:ప్రారంభం కావొచ్చని సమాచారం.
మరోవైపు రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలతో కూడిన బృందం ఈ నెల 5 న కలవనుంది. ఈ మేరకు వైసిపి గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం, తదనంతరం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును వైసిపి బృందం ఈ సందర్భంగా రాష్ట్రపతికి వివరించనుందని తెలిసింది.












Click it and Unblock the Notifications