ఎల్లుండి నెల్లూరులో జగన్ టూర్-షెడ్యూల్ ఇదే- రెండు నెలల్లో రెండోసారి..
ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి నెల్లూరు జిల్లాలో పర్యటించబోతున్నారు. తాజాగా నెల క్రితం నెల్లూరు బ్యారేజ్, సంగం బ్యారేజ్ లను ప్రారంభించేందుకు నెల్లూరు వెళ్లిన సీఎం జగన్ బహిరంగసభలో కూడా పాల్గొన్నారు. ఇప్పుడు మరోసారి నెల్లూరు పర్యటనకు సిద్దమయ్యారు. జిల్లాలోనే నేలటూరులో ఆయన టూర్ ఉండబోతోంది.
ఎల్లుండి గురువారం సీఎం వైయస్ జగన్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో పర్యటించబోతున్నారు. ముత్తుకూరు మండలం నేలటూరులో ఏపీజెన్కో ప్రాజెక్ట్ మూడో యూనిట్ (800 మెగావాట్లు)ను ఆయన జాతికి అంకితం చేయనున్నారు. నెల్లూరు టూర్ లో భాగంగా ఉదయం 9.30 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 10.55 గంటలకు కృష్ణపట్నం వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్దకు సీఎం జగన్ చేరుకుంటారు. అనంతరం 11.10 - మధ్యాహ్నం 1.10 గంటల మధ్య నేలటూరులో ఏపీజెన్కో ప్రాజెక్ట్ మూడో యూనిట్ (800 మెగావాట్లు) ప్రాజెక్టు జాతికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొంటారు.
జెన్ కో ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన తర్వాత అక్కడే ఏర్పాటు చేసే బహిరంగసభలోనూ ముఖ్యమంత్రి జగన్ పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 3.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. సీఎం జగన్ వైసీపీకి పట్టున్న నెల్లూరు జిల్లాలో వరుసగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందుకోసం ఎంత నిధులు వెచ్చించేందుకైనా సిద్దమని కూడా చెప్తున్నారు. గత ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 సీట్లకు 10 సీట్లు గెల్చుకున్న వైసీపీ.. 2024లోనూ అదే ఫీట్ రిపీట్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.