జగనన్న కాలనీలు త్వరగా రెడీ చేయండి-అధికారులకు జగన్ ఆదేశం- ఇళ్లపట్టాలపై కోర్టుల్లోనూ
ఏపీలోని జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పురోగతిపై సీఎం జగన్ ఇవాళ కీలక సమీక్ష నిర్వహించారు. ఇందులో గత సమావేశంలో ఇచ్చిన ఆదేశాల అమలు ఎంతవరకూ వచ్చిందన్న దానిపై సీఎం జగన్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అదే విధంగా ఇంకా ఎక్కడైనా అవసరాలు ఉంటే దానికి అగుణంగా తాజాగా పనులు మంజూరుచేసి పూర్తిచేస్తున్నామని అధికారులు తెలిపారు. దీనిపై స్పందించిన జగన్ కీలక అదేశాలు ఇచ్చారు
జగనన్న కాలనీలపై సమీక్ష
ఏపీలో పేదలకు ఇచ్చిన ఉచిత ఇళ్లస్ధలాల్లో నిర్మిస్తున్న జగనన్న కాలనీలపై సీఎం జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. హౌసింగ్ అధికారులతో కలిసి జరిపిన ఈ సమీక్షలో గత సమీక్షలో ఇచ్చిన ఆదేశాల పురోగతి తెలుసుకున్న జగన్.. పాటు తాజాగా మరికొన్ని ఆదేశాలు కూడా ఇచ్చారు. గత సమావేశంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఇంకా అవసరమైన చోట ల్యాండ్ లెవలింగ్, ఫిల్లింగ్, అంతర్గత రోడ్లు, గోడౌన్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేస్తున్నామని అధికారులు సీఎఁ జగన్ దృష్టికి తెచ్చారు.అలాగే ఆప్షన్ -3లో ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని వెల్లడించారు.
త్వరగా పూర్తి చేయాలన్న జగన్
జగనన్న కాలనీలపై సమీక్షలో వివరాలు తీసుకున్న సీఎం జగన్.. ఆప్షన్ -3 కింద ఎంపిక చేసుకున్న వారి ఇళ్ల నిర్మాణాన్ని సత్వరమే పూర్తిచేయడానికి నిర్దేశించుకున్న ఎస్ఓపీని పాటించాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన వనరులన్నీ కాలనీల్లో ఉన్నాయా?లేదా? ఇటుకల తయారీ యూనిట్లను కాలనీలకు సమీపంలోనే పెట్టుకున్నారా? లేదా? ఇవన్నీకూడా ఉండేలా చూసుకోవాలన్నారు. అలాగే గోడౌన్లు తదితర కనీస అవసరాలను సమకూర్చుకుని ఇళ్లనిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు.
ఇళ్లపట్టాలపై కోర్టులో స్పష్టత
ఈ నెలాఖరులోగా కోర్టు కేసుల వివాదాల్లోని ఇళ్లపట్టాలపై స్పష్టత కోసం ప్రయత్నించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. ఆగస్టు మొదటివారంలో ప్రత్యామ్నాయ ప్రణాళికతో సిద్ధంకావాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. 90 రోజుల్లో పట్టాలు పంపిణీపై కూడా సీఎం సమీక్ష చేశారు. లబ్ధిదారునికి కేవలం ఎక్కడ ఇంటి స్థలం ఇచ్చిందీ చూపడమే కాదు, పట్టా, దానికి సంబంధించిన డాక్యుమెంట్ల అన్నీకూడా ఇవ్వాలన్నారు. స్థలం ఇచ్చారని, దానికి సంబంధించిన పట్టా, డాక్యుమెంట్లు కూడా ఇచ్చారని లబ్ధిదారులనుంచి «ధృవీకరణ తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు.
నాణ్యతలో రాజీపడొద్దన్న జగన్
జగనన్న కాలనీల్లో డ్రెయిన్లు సహా కనీస మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ సూచించారు. డ్రైనేజి, కరెంటు, నీటి సరఫరా అంశాలపై దృష్టిపెట్టాలన్నారు. ఇళ్లలో పెట్టే ఫ్యాన్లు, బల్బులు, ట్యూబ్లైట్లు నాణ్యతతో ఉండాలన్నారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండొద్దని సీఎం స్పష్టంచేశారు.
జగనన్న కాలనీల రూపంలో కొన్నిచోట్ల ఏకంగా మున్సిపాల్టీలే తయారవుతున్నాయని, ఇలాంటి చోట్ల మౌలిక సదుపాయాల కల్పన, పౌరసేవలు తదితర అంశాలపై ప్రత్యేక ప్రణాళిక ఉండాలన్నారు. నిర్మాణ నాణ్యతపై అధికారులు ప్రతి దశలోనూ దృష్టిపెట్టాలన్నారు.