నా ఒక్కడి వల్లకాదు: బాబు దుమ్ముదులిపిన జగన్, మురళీ మోహన్పై సంచలన వ్యాఖ్యలు
Recommended Video
రాజమహేంద్రవరం: వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలో అడుగుపెట్టింది. కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం రోడ్డు కం రైల్ బ్రిడ్జికి చేరుకొని జిల్లాలోకి ప్రవేశించగానే వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం ఆయన రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాంట్ సెంటర్ వద్ద మాట్లాడారు. సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో మనం చూసింది పోలవరం, అమరావతి, ఇసుక, మట్టి, మద్యం, కరెంట్ కొనుగోళ్లు, బొగ్గు కొనుగోళ్లు.. ఇలా అన్నింటా అవినీతి అని జగన్ మండిపడ్డారు. చివరకు గుడి భూములను కూడా తింటున్నారన్నారు. చివరకు గ్రామస్థాయిలో జన్మభూమి మాఫియాకు అప్పగించారన్నారు. అన్నింటా లంచాలు అన్నారు. నాలుగేళ్ల క్రితం ఎన్నికల సమయంలో జాబు రావాలంటే బాబు రావాలన్నారని, ఇప్పుడు జాబు ఇవ్వలేదని, నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదన్నారు.
చంద్రబాబు 2 సినిమాలు చూపిస్తున్నారు
చంద్రబాబు రెండు అబద్దాల సినిమాలు చూపిస్తున్నారని జగన్ ఎద్దేవా చేశారు. గ్రాఫిక్స్తో అదిగో సింగపూర్, అదిగో జపాన్, అదిగో మైక్రోసాఫ్ట్, అదిగో ఎయిర్ బస్, అదిగో రాజధాని అంటూ అమరావతిని చూపిస్తున్నారన్నారు. రెండో సినిమా పోలవరం అన్నారు. అమరావతి సినిమాలో ఒక్క ఇటుక పడలేదన్నారు. ఇక పోలవరం పేరుతో ప్రతి సోమవారం పోలవరం అంటూ సినిమా చూపిస్తున్నారన్నారు. కలెక్షన్లు రాబట్టడం కోసం వారానికోసారి రివ్యూ చేస్తున్నారన్నారు. పునాది గోడ (డయా ఫ్రం వాల్) అయిపోయిందంటూ జాతికి అంకితం చేయడం విడ్డూరమన్నారు. కానీ ఇందులో ఎక్కువ శాతం వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే పూర్తయిందన్నారు. చంద్రబాబు మోసం చేయడంలో పీహెచ్డీ తీసుకున్నారన్నారు.
ప్రపంచంలో దేవుడి సొమ్ము తిన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టు తన కల అని చంద్రబాబు ఇఫ్పుడు అంటున్నారని, మరి నాడు తొమ్మిదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబుకు దేవుడు అంటే భయం లేదని, భక్తి లేదన్నారు. సాధారణంగా ఎవరైనా దేవుడి సొమ్ము తింటే అంతకంటే పాపాత్ముడు ఉండడన్నారు. కానీ చంద్రబాబు ఎంత దుర్మార్గుడు అంటే గోదావరి పుష్కరాల పేరుతో అక్షరాల రూ.2వేల కోట్లు వృథా చేశారన్నారు. వీధిలైట్లు, రోడ్లు అంటూ పుష్కరాల పేరుతో దేవుడి సొమ్ము కూడా తిన్న వ్యక్తి ప్రపంచలో ఎవరైనా ఉన్నారా అంటే అది చంద్రబాబు ఒక్కరే అన్నారు. ఇలాంటి వ్యక్తి సీఎంగా అర్హుడా అని ప్రశ్నించారు.
తాను సినిమా హీరోగా కనిపించడం కోసం 29 మందిని బలితీసుకున్నారు
గోదావరి పుష్కరాల సమయంలో ఈ పెద్దమనిషి షూటింగ్ కోసం, సినిమా హీరోలా కనిపించడం కోసం, వీఐపీ ఘాట్లో స్నానం చేయకుండా, సాధారణ భక్తులు స్నానం చేసే ఘాట్లో స్నానం చేసి భక్తులను ఇబ్బందులకు గురి చేశాడన్నారు. ఆ తర్వాత సినిమాలో తాను బాగా కనిపించాలని, తన పుణ్యస్నానం అయ్యాక భక్తులను ఒక్కసారిగా వదిలేసి 29 మందిని బలితీసుకున్నారన్నారు. ఇలాంటి వ్యక్తి సీఎంగా అర్హుడా అన్నారు. తాను సినిమా హీరోలా కనిపించడం కోసం భక్తుల ప్రాణాలు బలిగొన్నాడన్నారు. దేవుడి సొమ్మును లూటీ చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. చంద్రబాబు లాంటి విలన్ సీఎంగా ఉండేందుకు అర్హుడు కాదన్నారు.
మురళీ మోహన్, గోరంట్లలపై విమర్శలు, ఇక్కడి నుంచే ఎక్కువమంది కొనుగోలు
ఎంపీ మురళీ మోహన్, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు బాధ్యత గల పదవుల్లో ఉండి చంద్రబాబుకు, చినబాబుకు ఇంత ఇచ్చి ఇసుక దోపిడీ చేస్తున్నారని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి రోజు ఇక్కడి నుంచి వేలాది లారీలు, లక్షలాది టన్నుల ఇసుకను తీసుకు వెళ్తున్నాయని చెబుతున్నారన్నారు. మన పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేశారన్నారు. కేవలం ఈ జిల్లా (తూర్పు గోదావరి) నుంచే పదిహేను మందిని చంద్రబాబు కొనుగోలు చేశారన్నారు.
అది జగన్ ఒక్కడి వల్ల కాదు
చంద్రబాబు కేబినెట్లో ఉన్న మంత్రి ఒకరు బీరు హెల్త్ డ్రింక్ అని చెబుతారని జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు నోరు ఓ అబద్దాల ఫ్యాక్టరీ అని, ఆయన నోరు ఓ క్షుద్ర ప్రపంచం అన్నారు. చంద్రబాబు పాలన ఏ రాక్షసుడి పాలనకు తీసిపోదన్నారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలన చూశారని, మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయని, కాబట్టి ఇలాంటి అబద్దాలు చెప్పే వారిని పక్కన పెట్టాలన్నారు. రాజకీయ వ్యవస్థ మారాలన్నారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలంటే ఒక జగన్ వల్లే సాధ్యం కాదని, జగన్కు మీ అందరి తోడు కావాలన్నారు. బాబు కంటే బీహార్ రాష్ట్రం బెట్టర్ అని ఓ సంస్థ చెప్పిందన్నారు. పొరపాటున కూడా చంద్రబాబు లాంటి మోసపు వ్యక్తిని క్షమించవద్దన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఇక మీ ముందుకు వచ్చి నేను ఇచ్చిన 95 శాతం హామీలు నెరవేర్చానని చెబుతారని, ఆ తర్వాత ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానని చెబుతారని, దానికి బోనస్గా బెంజ్ కారు ఇస్తానని చెబుతారన్నారు. కానీ మీ మనస్సాక్షి ప్రకారం ఓటేయాలన్నారు.