పొట్టి శ్రీరాములు వర్ధంతి, జగన్ నివాళి: అసెంబ్లీకి బిల్లు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అవతరణకు సంకేతంగా, ఆంధ్రప్రదేశ్ అవతరణకు పాటుపడిన నేతగా పొట్టి శ్రీరాములును పరిగణిస్తూ వస్తున్నారు. అయితే, తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం ప్రాణాలర్పించలేదనే వాదన, మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రాంతం విడిపోవడానికి మాత్రమే ఆయన ప్రాణత్యాగం చేశారనే సూత్రీకరణ ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని ఇలా ఉంచితే, ఆయన వర్ధంతి రోజునే రాష్ట్ర విభజనకు సంబంధించిన తెలంగాణ ముసాయిదా బిల్లు శాసనసభకు వచ్చింది.
తెలంగాణ ముసాయిదా బిల్లును శాసనసభలో సోమవారం ప్రతిపాదించారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి రోజునే ముసాయిదా బిల్లును ప్రతిపాదించడం యాదృచ్ఛికమే అయినా అది చర్చనీయాంశంగా మారింది. పొట్టి శ్రీరాములు వర్ధంతి రోజునే విభజన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టడం దురదృష్టకరమని ఎపి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి. అశోక్ బాబు అన్నారు.

కాగా, పొట్టి శ్రీరాములు చిత్రపటానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, ఆయన తల్లి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సోమవారం నివాళులు అర్పించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పోరాటం చేస్తున్న ఆయన సమైక్యానికి ప్రతీకగా పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగాన్ని తీసుకుంటున్నారు.

ఇదిలావుంటే, వైయస్ జగన్ సోమవారం ఉదయం పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై సభలో అనుసరించాల్సిన విధానంపై శాసనసభ్యులకు మార్గనిర్దేశం చేశారు.












Click it and Unblock the Notifications