ఇడుపులపాయలో తండ్రికి జగన్ నివాళి, దీక్షలు
కడప: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా ఇడుపులపాయలో మంగళవారం నివాళులు అర్పించారు. వైయస్ సమాధిపై పుష్పగుచ్చాలు ఉంచి, ఆయన మౌనంగా ప్రార్థనలు జరిపారు. 16 నెలల తర్వాత ఆయన ఇడుపులపాయలో కాలు పెట్టారు.
జగన్ జైలులో ఉన్న సమయంలో వైయస్సార్ రెండు వర్ధంతులు, రెండు జయంతులు వెళ్లిపోయాయి. కోర్టు అనుమతి తీసుకుని ఆయన మంగళవారం ఇడుపులపాయకు వచ్చారు. జగన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు వైయస్సార్కు నివాళులు అర్పించారు. తల్లి వైయస్ విజయమ్మ, సతీమణి భారతితో కలిసి ఆయన ప్రార్థనలు చేశారు. పార్టీ శాసనసభ్యులు, పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో వైయస్సార్ ఘాట్ క్రిక్కిరిసిపోయింది.

కాగా, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్తో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బుధవారం నుంచి సీమాంధ్రలోని 175 నియోజకవర్గాల్లో ఒకేసారి నిరాహార దీక్షలు చేపట్టనుంది. గాంధీ జయంతి నుంచి రాష్ట్రావతరణ దినోత్సవం నవంబర్ 1వ తేదీ వరకు ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతాయి.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తన సమైక్యపోరు కార్యక్రమాన్ని విడుదల చేసింది. అక్టోబర్ 2 నుంచి చేపట్టబోయే కార్యక్రమాల్లో ర్యాలీలు, ధర్నాలు, మానవహారాలు, బైక్ ర్యాలీలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications