జగన్ ఫిక్స్, ఇక జనంలోకి..చేరికలు - ముహూర్తం ఖరారు..!!
మాజీ సీఎం జగన్ రూటు మార్చారు. కీలక నిర్ణయాలకు సిద్దమయ్యారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న వేళ.. ఇక ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు ముహూర్తం ఫిక్స్ అయింది. ప్రజా నిరసనల్లో పాల్గొనాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా పార్టీ ప్రక్షాళన దిశగా నిర్ణయాలు చేయనున్నారు. పార్టీ ప్లీనరీ నిర్వహణ పైన ఇప్పటికే చర్చలు చేసిన జగన్.. కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యూహం మార్చారు. ఇక.. ప్రత్యక్ష పోరాటానికి సిద్దం అవుతున్నారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అసెంబ్లీ- లోక్ సభ నియోజకవర్గాల కన్వీనర్ల తో ఈ నెల 27న కీలక సమావేశం ఏర్పాటు చేసారు. రెండేళ్ల పాలన, స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ వైఫల్యాలు, పార్టీ ప్రక్షాళన దిశగా నిర్ణయాలు ఉండనున్నాయి. పార్టీ నేతలతో జరిగే విస్తృత స్థాయి సమావేశం లో పలు అంశాల పైన చర్చించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల కాలం పూర్తవుతున్న వేళ భవిష్యత్ కార్యాచరణ పైన పార్టీ వ్యూహరచన, ఎస్ఐఆర్ అంశం, పార్టీ కమిటీల నిర్మాణం తదితర అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ రెండేళ్ల పాలన వైఫల్యాలు, ప్రజా సమస్యలపైనా దిశా నిర్దేశం చేయనున్నారు. నియోజకవర్గ స్థాయి నుంచి పీఏసీ వరకు అన్ని స్థాయిల నేతలను ఈ సమావేశానికి ఆహ్వానించారు.

పార్టీ నేతల సమావేశంలో కీలక నిర్ణయాలు
కాగా.. మాజీ సీఎం జగన్ ఈ భేటీలో కొత్త నిర్ణయాలు ప్రకటించనున్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి.. అమలు చేయని పథకాల పైన ఆందోళనకు సిద్దం కావాలని భావిస్తున్నారు. సూపర్ సిక్స్ హామీలు పూర్తి స్థాయిలో అమలు కావటం లేదని జగన్ పదే పదే ఆరోపిస్తున్నారు. అదే విధంగా రాష్ట్రంలో వైసీపీ శ్రేణుల పైన కేసులు.. నిర్బంధాల పైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల సమయం పూర్తి కావటంతో ఇక ప్రభుత్వం పైన నిరసనలు.. ఆందోళనకు సిద్దం కావాలని జగన్ పార్టీ నేతలకు ఇప్పటికే సూచించారు. ఇందు కోసం రాష్ట్ర స్థాయిలో నిరసన కార్యక్రమం లో తానే స్వయంగా పాల్గొనాలని జగన్ భావిస్తున్నారు. దీంతో.. ఈ భేటీలో పార్టీ పరంగా చేపట్టే కార్య క్రమాలతో పాటుగా తాను పాల్గొనే నిరసన పైనా స్పష్టత ఇవ్వనున్నారు. ఇక నుంచి పూర్తి స్థాయి లో పార్టీ కార్యక్రమాలు వేగవంతం చేయాలని జగన్ నిర్ణయించారు. అదే విధంగా పార్టీలో చేరికల పైనా ఇప్పటికే నిర్ణయించారు. వచ్చే నెలలో గోదావరి, శ్రీకాకుళం కు చెందిన కొందరు కీలక నేతలు వైసీపీలో చేరేందుకు రంగం సిద్దమైంది.












Click it and Unblock the Notifications