రోజుకు రూ.1కోటి: లోకేష్పై జగన్ షాకింగ్, పక్కన తెలంగాణను చూడండి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబును దింపుతామా లేదా అనేది కాదని, జరిగేది జరుగుతుందని జగన్ అన్నారు.
సభాపతి కోడెల శివప్రసాద్ రావు పైన అవిశ్వాస తీర్మానం విషయమై విలేకరులు ప్రశ్నించారు. దీనిపై జగన్ మాట్లాడారు. చంద్రబాబును దింపుతామా లేదా అనేది తర్వాత అని, జరిగేది జరుగుతుందన్నారు. స్పీకర్ పైన అవిశ్వాసం పెట్టాల్సిందేనని చెప్పారు.
రాక్షస పాలనతో విసుగెత్తి, చంద్రబాబు చేసిన అన్యాయమైన పాలన ఆయనకే చూపించేందుకు తాము అవిశ్వాసం నోటీసులు ఇచ్చామని చెప్పారు. మరో విలేకరి ప్రశ్నకు... ఒకరోజు కొడితే పడతాం... రెండో రోజు పడతాం.. ప్రతి రోజు పడం కదా అని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో ఇసుక మాఫియా, భూమాఫియా, కాల్ మనీ మాఫియా చివరకు సెక్స్ రాకెట్ మాఫియా ఉందని, అయినా ఇంత దారుణ ప్రభుత్వం దేశంలోనే చూడలేదన్నారు. ప్రాజెక్టులు సహా మాఫీయాల్లో లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
కల్తీ మద్యం తాగి ఐదుగురు చనిపోతే దానిని పక్కన పెట్టి.. చంద్రబాబు ఇంటింటికి పోలీసుల్ని పంపించారని, 30 మందిని కాపాడారని చెప్పడం విడ్డూరమన్నారు. కల్తీ మద్యం వల్ల చనిపోతే అది చంద్రబాబు తప్పు కాదా అని నిలదీశారు. ఈ విషయంలో చంద్రబాబును జైలుకు పంపించాలన్నారు.
ఇసుక మాఫియా దారుణంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇసుక మాఫియాలో రూ.800 కోట్లు ఏమవుతున్నాయని ప్రశ్నించారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి చంద్రబాబు కొడుకుకు (నారా లోకేష్) ప్రతి రోజు రూ.1 పోతోందన్నారు. అన్నింటా లంచమేనని మండిపడ్డారు.
జెన్కోలోను అవినీతి జరుగుతోందన్నారు. 1600 మెగావాట్ల విద్యుత్ కొనుగోలులో స్కాం జరిగిందన్నారు. రూ.2600 కోట్ల భారీ అవినీతి చోటు చేసుకుందన్నారు. పక్కనున్న తెలంగాణలో మెగావాట్కు రూ.4.4 కోట్లు, గుజరాత్లో రూ.4.42 కోట్లు ఉంటే జెన్కోలో మాత్రం రూ.5కు పైగా ఉందన్నారు. పక్క రాష్ట్రాలకు, ఏపీ జెన్కోకు ఇంత తేడా ఎందుకు ఉందని నిలదీశారు. మద్యం సహా అన్నింటా లంచాలు అని బాబుపై మండిపడ్డారు.
సభ తీరుపై రఘువీరా రెడ్డి ఆగ్రహం
ఏపీ శాసన సభ జరిగిన తీరు పైన ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. సభ జరిగిన తీరు బాధాకరంగా ఉందన్నారు. సమావేశాల తీరును ప్రజలు ఛీకొడుతున్నారన్నారు. ప్రతిపక్షం లేకుండానే బిల్లుల ఆమోదం తగదన్నారు.
ప్రయివేటు వారికి భూములు అప్పగించే బిల్లు సరికాదన్నారు. దీనిపై తాము గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని, గవర్నర్ ఆ బిల్లులను ఆమోదించవద్దన్నారు. మండలి కాంగ్రెస్ సభ్యుడు సీ రామచంద్రయ్య మాట్లాడుతూ... సమావేశాలను ప్రభుత్వం పక్కదారి పట్టించిందన్నారు. బిఏసికి విలువ లేకుండా చేసిందన్నారు.