ఏపీలో భూముల సర్వేకు జగన్ డెడ్ లైన్- ఆ తర్వాత అర్బన్ లోనూ మొదలు-కీలక ఆదేశాలు..
అమరావతి : వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష (భూముల సమగ్ర రీసర్వే)పై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. సర్వే తాజా పరిస్దితి, పూర్తయిన చోట ప్రజలకు భూహక్కు పత్రాల అందజేత, సర్వే రాళ్ల వ్యవహారం, అర్బన్ ప్రాంతాల్లోనూ సర్వే చేపట్టడంపై అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు.
రీ - సర్వే అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమమని సీఎం జగన్ ఈ సందర్భంగా అధికారులకు స్పష్టం చేశారు. వందేళ్ల తర్వాత మరలా సర్వే చేస్తున్నాం అంటే నిజంగానే కొత్త చరిత్ర లిఖిస్తున్నట్లేనని జగన్ తెలిపారు. రీ సర్వే పేరుతో మహాయజ్ఞం చేస్తున్నామని, వాటి ఫలాలు కచ్చితంగా ప్రజలకు అందాలన్నారు. సర్వేలో కచ్చితంగా నాణ్యత ఉండాలని ఆదేశించారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంతమంది సర్వేయర్లు, సర్వే సిబ్బంది మన రాష్ట్రంలో అందుబాటులో ఉన్నారని, తొలివిడతలో సర్వే పూర్తయిన 2 వేల గ్రామాలకు సంబంధించి భూహక్కు పత్రాలు అందించే కార్యక్రమాన్ని పూర్తిచేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. జనవరి నాటికి ఈ కార్యక్రమం పూర్తి కావాలన్నారు.

తొలివిడత సర్వే పూర్తయిన 2వేల గ్రామాల్లో ఇప్పటివరకు 2 లక్షల మ్యటేషన్లు, 92వేలు ఫస్ట్ టైం ఎంట్రీస్ జరగ్గా, 7,29,000 మందికి భూహక్కు పత్రాలు అందజేశామని సీఎం జగన్ కు అధికారులు తెలిపారు. 4.30 లక్షల సబ్ డివిజన్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. 19వేల భూవివాదాలను పరిష్కారమయ్యాయని చెప్పారు. ఫలితంగా ప్రజలకు రూ.37.57 కోట్ల మేరకు ఆదా అయినట్లు వారు సీఎంకు తెలిపారు. మరో 2వేల గ్రామాల్లో రీసర్వే ప్రక్రియకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను సీఎంకు వివరించారు. వచ్చే ఫిబ్రవరి 15 నాటికి సర్వే పూర్తి చేస్తామని తెలిపారు. అదే నెల చివరికల్లా భూహక్కు పత్రాలను కూడా అందజేస్తామన్నారు.
సమగ్ర సర్వే కార్యక్రమం సకాలంలో పూర్తి చేయడానికి అవసరమైన సిబ్బంది కొరత లేకుండా చూసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. గ్రామ సచివాలయంలో కావల్సినంత మంది సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీని కోసం సచివాలయాన్ని యూనిట్గా తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15వేల గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ కావాల్సిన సిబ్బందిని నియమించుకోవాలన్నారు. ఖాళీలున్నచోట వెంటనే నియామకాలు చేపట్టాలన్నారు. 22-ఏ సమస్య పరిష్కరించి హక్కు పత్రాలు అందజేసిన లబ్ధిదారులకు లేఖలు రాయాలని ఈ సందర్భంగా సీఎం అధికారుల్ని ఆదేశించారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించి వారికి జరిగిన మేలును తెలియజేసేలా.. లబ్ధి పొందిన ప్రతి వారికి వ్యక్తిగతంగా లేఖ రాయాలన్నారు.హక్కు పత్రాలు పొందిన వారందరికీ లేఖలు రాయాలన్నారు.
ఈ సందర్భంగా సర్వే రాళ్లపైనా సీఎంకు అధికారులు వివరాలందించారు. దీంతో సర్వేరాళ్ల ఉత్పత్తి వేగం పెంచాలని సీఎం కోరారు. సమగ్ర భూసర్వే ప్రక్రియను మరింత వేగవంతంగా చేపట్టాలన్నారు. భూగర్భ గనులుశాఖ అధికారులు సర్వే రాళ్ల ఉత్పత్తి పెరిగేలా అదనపు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. మార్చి కల్లా సర్వేకు అవసరమైన రాళ్లు సిద్ధంగా ఉంచుతామని అధికారులు తెలిపారు. ఇందుకోసం అవసరమైన ప్రొడక్షన్ కెపాసిటీనీ మైనింగ్ శాఖ పెంచుకోవాలని సీఎం సూచించారు. ఇందులో ఎలాంటి జాప్యానికి తావుండరాదన్నారు.

అలాగే అర్భన్ ప్రాంతాల్లో సర్వేపైనా సీఎం సమీక్ష చేశారు. 123 కార్పొరేషన్లు, మున్సిపాల్టీల పరిధిలో 4119 వార్డు సచివాలయాల్లో ఇప్పటికే సర్వే కోసం అవసరమైన బృందాల ఏర్పాటు, శిక్షణ పూర్తయిందని అధికారులు తెలిపారు.
హద్దుల మార్కింగ్, రోవర్ల సహాయంతో జీసీపీ ఐడెంటిఫికేషన్ ప్రక్రియను 2023 జనవరి నెలాఖరునాటికి పూర్తిచేస్తామని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 123 కార్పొరేషన్లు, మున్సిపాల్టీల పరిధిలో 1,16,685 ప్రభుత్వ, పోరంబోకు ల్యాండ్ పార్సిల్స్కు సంబంధించి 3,37,702 ఎకరాలు భూమిని గుర్తించామన్న పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ అధికారులు, జూలై 2023 నాటికి పట్టణ ప్రాంతాల్లోనూ సమగ్ర సర్వే హక్కు పత్రాల పంపిణీ పూర్తి చేయనున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications