చంద్రబాబుకు కొరుకుడుపడని బెంగళూరు
YS Jagan Mohan Reddy: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత చోటుచేసుకుంటోన్న హత్యలు, అత్యాచారాలు, దాడులకు వ్యతిరేకంగా దేశ రాజధాని వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దీక్ష విజయవంతమైంది.
చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు, దాడులపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైసీపీ నిర్వహించిన ఆందోళనలకు జాతీయ స్థాయి ప్రతిపక్షాల నుంచి మంచి స్పందన లభించింది. సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) నాయకుడు సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది, తృణమూల్ కాంగ్రెస్ నేత నదీముల్హక్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఏఐఏడీఎంకే, ఇండియన్ ముస్లిం లీగ్ నాయకులు ఇందులో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలిచారు.

ప్రతిపక్షాల ఉమ్మడి సంకీర్ణ కూటమి ఇండియా నుంచి అనూహ్యంగా మద్దతు లభించింది. ఈ కూటమిలో దాదాపు అన్ని భాగస్వామ్య పక్షాల నాయకులు, ఎంపీలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీకి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. చంద్రబాబు- పవన్ పాలనపై విమర్శలు గుప్పించారు. ఈ ఆందోళన విజయవంతం కావడం వైఎస్ఆర్సీపీ క్యాడర్లో జోష్ పెరిగింది.
అదే ఊపుతో వైఎస్ జగన్.. మీడియా ముందుకు వచ్చారు. ఈ ఉదయం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్లో మట్లాడారు. అనేక అంశాలను ప్రస్తావించారు. శాంతి భద్రతలు మొదలుకుని, సూపర్ 6 హామీల అమలు వరకు చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎగ్గొట్టే ఉద్దేశంలో ఉందంటూ మండిపడ్డారు.
దీని తరువాత మళ్లీ జగన్ బెంగళూరు బాట పట్టనున్నారు. ఈ సాయంత్రం 4 గంటలకు బెంగళూరుకు బయలుదేరి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మొన్నటివరకు ఆయన బెంగళూరులోని తన నివాసంలో ఉన్నారు. పార్టీ కార్యకర్త రషీద్ దారుణహత్య నేపథ్యంలో పల్నాడు జిల్లా వినుకొండకు వచ్చారు. ఆ తరువాత ఢిల్లీ వెళ్లారు.
ఇప్పుడు మళ్లీ ఆయన బెంగళూరుకు వెళ్లబోతోండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల తరువాత జగన్ ఎక్కువ కాలం అక్కడే ఉంటోన్న విషయం తెలిసిందే. ఎన్నికల తరువాత రెండుసార్లు ఆయన బెంగళూరుకు వెళ్లారు. మొన్నటి వరకూ అక్కడే ఉన్నారు.
బెంగళూరు కేంద్రంగా ఆయన రాజకీయాలను నడిపిస్తోన్నారని, జాతీయ స్థాయిలో ప్రభావితం చేసేలా స్కెచ్ వేస్తోన్నారంటూ ఇదివరకే వార్తలొచ్చాయి. ప్రతిపక్షాల ఉమ్మడి సంకీర్ణ కూటమి ఇండియాకు సారథ్యాన్ని వహిస్తోన్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలో ఉండటం, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో జగన్కు సన్నిహిత సంబంధాలు ఉండటం చర్చనీయాంశమౌతోంది.












Click it and Unblock the Notifications