విభజన: జగన్ ఆమరణ నిరాహార దీక్ష, బాబుకు రిక్వెస్ట్
హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ శనివారం నుండి తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని, ఓట్లు సీట్ల కోసమే రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
గతంలో కనివిని ఎరుగని రీతిలో విభజన జరుగుతోందన్నారు. విభజన జరిగితే ఎన్నో సమస్యలు వస్తాయన్నారు. మీ చావు మీరు చావండి అన్న రీతిలో విభజన చేస్తున్నారని ఆరోపించారు. విభజనతో నీటి యుద్ధాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల మధ్య నీటి కోసం కొట్లాడ జరగడం లేదా అని ప్రశ్నించారు.

తమిళనాడు, కర్నాటకల మధ్య ఎంతో కాలంగా నీటి గొడవ జరుగుతోందన్నారు. తాను చెప్పినవి వాస్తవాలు కాదా చెప్పాలన్నారు. రేపు విభజన జరిగితే ఈ రెండు రాష్ట్రాల మధ్య కూడా అదే పరిస్థితి తలెత్తుతుందన్నారు. గతంలో విభజన జరిగినప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఏకాభిప్రాయం ఉందని, ఇప్పుడు అది లేదన్నారు. అలాంటప్పుడు ఎలా విభజిస్తారని ప్రశ్నించారు.
బాబుకు ప్రశ్న
తాను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేస్తున్నానని, చరిత్రహీనులుగా మిగిలిపోవద్దని సమైక్య ఉద్యమంలో కలిసి రావాలని కోరుతున్నట్లు చెప్పారు. సమైక్యాంధ్ర కోసం ప్రతి ఒక్కరు కలవాల్సి ఉందన్నారు. ఇప్పుడు పొరపాటు చేస్తే భవిష్యత్తు తరాలకు అన్యాయం చేసిన వారమవుతామన్నారు. తన దీక్ష వద్దకు ఏ పార్టీ వారయినా తమ తమ పార్టీ జెండాలతో రావొచ్చన్నారు. చంద్రబాబు టిడిపి జెండాతో, బిజెపి, ఇతర పార్టీలు వారి వారి జెండాలతో రావొచ్చన్నారు.












Click it and Unblock the Notifications