రాజధాని జిల్లాలోకి జగన్ పాదయాత్ర ప్రవేశం: 20 రోజుల పాటు యాత్ర
ప్రతిపక్ష నేత జగన్ ప్రజాసంకల్ప యాత్ర సోమవారం ఉదయం రాజధాని జిల్లా గుంటూరు జిల్లాలో ప్రవేశించింది. జగన్ తన 109 వ రోజు పాదయాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగగా...110 వ రోజు ప్రకాశం జిల్లా ఈపూరుపాలెం నుంచి మొదలై గుంటూరు జిల్లాలో అడుగుపెట్టారు.
జిల్లాలోని బాపట్ల నియోజకవర్గం పరిధిలో పాదయాత్ర మొదలయింది. జిల్లాలోని మొత్తం 13 నియోజకవర్గాల్లో జగన్ పాదయాత్ర కొనసాగనుంది. జిల్లాలో సుమారుగా 20 రోజులు సాగే ప్రజాసంకల్పయాత్రను పూర్తి అయిన తర్వాత జగన్ కృష్ణా జిల్లాలోకి ప్రవేశిస్తారు. మరోవైపు వైసిపి ప్రారంభించి 8 సంవత్సరాలు అయిన సందర్భంగా జగన్ ఈ విషయమై ట్వీట్ చేశారు. విలువలతో కూడిన రాజకీయాలను 8 ఏళ్ల క్రిందట ఇదే రోజు ప్రారంభించామని పేర్కొన్నారు.
సోమవారం బాపట్ల నియోజకవర్గం పరిధిలోని స్టూవర్ట్ పురం వద్ద జగన్ పాదయాత్ర గుంటూరు జిల్లాలో ఉదయం 9 గంటల 10 నిమిషాలకు ప్రవేశించింది. పాదయాత్ర బాపట్ల చేరుకున్న అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు బహిరంగ సభ జరగనుంది. అనంతరం బాపట్ల, పొన్నూరు, ప్రత్తిపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు, తాడికొండ, గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు, వేమూరు, తెనాలి, మంగళగిరి నియోజకవర్గాల్లో...దాదాపు 275 కిలో మీటర్లకుపైగా జగన్ యాత్ర కొనసాగుతుంది.