జగన్పై అసంతృప్తుల వెల్లువ: బీజేపీ వైపు చూస్తున్నారు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన అసంతృప్తుల వెల్లువ రోజు రోజుకు పెరుగుతోందని అంటున్నారు. తాజాగా జగన్ మేనమామ కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా ఊహాగానాలు వినిపించాయి. ఎమ్మెల్యే, మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి యువనేత తీరు పట్ల ఆవేదన వ్యక్తం చేశారని, జగన్, కార్యకర్తల అతి విశ్వాసం వల్లనే సార్వత్రిక ఎన్నికలలో పార్టీ ఓడిపోయిందని వ్యాఖ్యానించారని ప్రచారం జరిగింది. అయితే, రవీంద్రనాథ్ అసంతృప్తి వట్టిమాటే అంటున్నారు.
ఇటీవల జగన్ పైన పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం సీనియర్ నేత కొణతాల రామకృష్ణ జగన్కు ఘాటు లేఖ రాశారు. ఇప్పుడు స్వయంగా మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి తప్పుపట్టడం చర్చనీయాంశమైంది. ఏపీలో... కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల నుండి పలువురు నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ వైపుకు వెళ్లారు. కొణతాలది కూడా అదే దారి అనే వాదనలు వినిపిస్తున్నాయి.
సార్వత్రిక ఎన్నికల్లో విజయం తమదేనంటూ మితిమీరిన ఆత్మవిశ్వాసం వ్యక్తం చేయడం వల్లే వైసీపీ ఓడిపోయిందనే వాదనలు తొలి నుండి ఉన్నాయి. ఇప్పుడు ఆ పార్టీయే క్రమంగా కుదేలవుతోందని అంటున్నారు. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ముగ్గురు నేతలు బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
జగన్కు అత్యంత సన్నిహితుడైన ఒక ఎంపీ, మరో ఎమ్మెల్యే ఇటీవల ఢిల్లీలో ఆమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలను కలసి బీజేపీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో మరో ఎమ్మెల్యే కూడా ఇదే దోవలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారానికి తగినట్లు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబుపై పొగడ్తలు కురిపించారు. పార్టీ మారే అంశంపై స్పందిస్తూ.. తాను ఐదేళ్ల పాటు వైసీపీలోనే ఉంటానని చెప్పారు.
మిగిలేది టీడీపీ, బీజేపీలే: మంత్రి మాణిక్యాల రావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో టీడీపీ, బీజేపీ మాత్రమే మిగులుతాయని మంత్రి మాణిక్యాలరావు అన్నారు. మంగళవారం గుంటూరు అర్బన్ బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
కాంగ్రెస్ నిష్క్రమణ దశకు చేరిందని, వైసీపీ అధ్యక్షులు జగన్ ఎప్పుడు జైలు నుంచి పిలుపు వస్తుందా అని అన్నీ సర్దుకొని కూర్చున్నారని, మరో ప్రత్యామ్నాయం లేక ఆ పార్టీ నాయకులు కూడా త్వరలోనే బీజేపీలో చేరనున్నారని మాణిక్యాల రావు అన్నారు. దేశవ్యాప్తంగా మోడీ పవనాలు వీస్తున్నాయని, మోడీ నాయకత్వాన్ని మెచ్చిన అందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు.