చెవుల్లో పువ్వులు పెడుతున్నారు: చంద్రబాబుపై జగన్
అనంతపురం: రుణమాఫీ అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనాల చెవుల్లో పువ్వులు పెట్టారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏమీ తెలియని వారికి ఏ విషయం అయినా చెప్పవచ్చని, అన్ని తెలిసిన కూడా చంద్రబాబు అబద్దాలు ఆడుతున్నారని ఆయన అన్నారు. రైతుల పట్ల ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు వాగ్దానాలు చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని వైఎస్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబుకు విదేశాలపై ఉన్న మోజు ఆంధ్రప్రదేశ్ లేదని ఆయన విమర్శించారు.
అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర గురువారం నాలుగోరోజు కొనసాగింది. యాత్రలో భాగంగా ఆయన గురువారం తిమ్మాపురంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు పుల్లయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి తమ పార్టీ అన్నివిధాల అండగా ఉంటుందని ధైర్యాన్ని చెప్పారు.

అనంతరం రైతు, డ్వాక్రా సంఘాలతో వైఎస్ జగన్ ముఖాముఖీ అయ్యారు. ఈ సందర్భంగా రైతులు, డ్వాక్రా మహిళలు తమ సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకు వచ్చారు. తమకు రుణాలు మాఫీ కావటం లేదని రైతులు, డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ రైతులు చాలా కష్టాల్లో ఉన్నారని, డ్వాక్రా మహిళల పరిస్థితి దారుణంగా ఉందన్నారు.
కాగా రైతు, డ్వాక్రా రుణాల మాఫీ ఎక్కడా చేయలేదని, ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం ఇవ్వలేదని, రైతులు, మహిళలకు కొత్త రుణం కూడా మంజూరు చేయలేదన్నారు. రుణాల కోసం బ్యాంకులకు వెళితే అధికారులు పాస్బుక్లు విసిరి పారేస్తున్నారని మహిళలు వైఎస్ జగన్ కు మొరపెట్టుకున్నారు.
అంతకు ముందు నల్లదాసరిపల్లి గ్రామస్తులు తమ గ్రామంలో తాగునీటి సమస్య ఉందని వైఎస్ జగన్ దృష్టికి తీసుకు వెళ్లారు. తాగునీటి కోసం అల్లాడిపోతున్నామని, ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని నల్లదాసరిపల్లి గ్రామస్తులకు వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications