బాబు వద్ద ఒక్క టాలెంట్.., మీరు సీఎంగా ఉన్నప్పుడే: జగన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఒక్క టాలెంట్ మాత్రం ఉందని, అది కళ్లార్పకుండా అబద్దాలు ఆడగలరని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం శాసన సభలో అన్నారు. నదుల అనుసంధానంపై చంద్రబాబు మాట్లాడిన తర్వాత జగన్ స్పందించారు.
చంద్రబాబు కళ్లార్పకుండా అబద్దాలు ఆడారన్నారు. టెండర్ అయిన తర్వాత 16.9 బోనస్ ఇస్తామని చెప్పడం ఆయన తెలివితేటలకు నిదర్శనమన్నారు. టెండర్కు ముందే ఎందుకు చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. రాయలసీమ ప్రాజెక్టులు పూర్తయితే నికర జలాలు వచ్చి ఉండేవన్నారు.

తెలుగు గంగ, వెలిగొండ ప్రాజెక్టులు పూర్తయి ఉంటే నికర జలాలకు అవకాశముండేదన్నారు. ఎండాకాలంలో కూడా వరదలు వస్తాయని చంద్రబాబు మాత్రమే చెప్పగలరని ఎద్దేవా చేశారు. అలమట్టి ప్రాజెక్టు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే పూర్తయిందనే విషయం తెలుసుకోవాలన్నారు.
తొమ్మిదేళ్లలో పులిచింతల ప్రాజెక్టుకు చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది కేవలం రూ.24 కోట్లే అన్నారు. చంద్రబాబుకు ప్రాజెక్టులు ఎక్కడున్నాయో తెలిసినందుకు సంతోషమని, వాటి సామర్థ్యం తెలిసినందుకు ఇంకా సంతోషమని ఎద్దేవా చేశారు. కాగా, జగన్ 5సీ బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ లేఖను ప్రస్తావించారు. అలాగే 2000లో వచ్చిన సుప్రీం తీర్పు కాపీని చదివి వినిపించారు.
ముఖ్యమంత్రిపై సభా హక్కుల నోటీసు
ముఖ్యమంత్రి చంద్రబాబు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభా హక్కుల నోటీసు ఇచ్చింది. అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణకు నోటీసును అందజేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అగౌరవపరిచేలా సీఎం మాట్లాడారని ఆరోపించింది.












Click it and Unblock the Notifications