అందుకే గెలుస్తామన్నాం, భార్యకు చెప్పలేని స్థితి: జగన్
కడప: రాజకీయ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తాను నాలుగేళ్ల పాటు ప్రజల కోసం పోరాటం చేశానని, అందుకే తాము అధికారంలోకి వస్తామని విశ్వసించామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం అన్నారు. ఇడుపులపాయలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభా పక్ష సమావేశం జరిగింది. జగన్ను తమ నేతగా శాసన సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు.
తన పైన నమ్మకం ఉంచి పార్టీ శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నందుకు ఆయన ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆనాడు విలువల కోసమే తాను, తన అమ్మ కాంగ్రెసు పార్టీ నుండి బయటకు వచ్చామన్నారు. తాను బయటకు వచ్చినప్పుడు కొండను ఢీకొంటున్నావని, నాశనమవుతావని ఎందరో హెచ్చరించారన్నారు. అధికార పార్టీపై పోరాడటం కష్టమని చెప్పారన్నారు. ఆ తర్వాత తనతో వచ్చిన శాసన సభ్యులు తనతోనే ఉన్నారన్నారు.
రాజకీయం ఉన్నా లేకున్నా మనిషి మనిషిగా బతకాలని తన హృదయం చెప్పిందన్నారు. ఆ రోజు తన మెదడు, గుండె ఏం చెప్పిందో అదే చేశానన్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. నాలుగు సంవత్సరాల పాటు పోరాటం చేశానని, అందుకే అధికారంలోకి వస్తామని గట్టిగా నమ్మామన్నారు. తన పైన కుట్రలు, కుతంత్రాలు చేశారన్నారు. సిబిఐ అనే ఆయుధాన్ని వాడారని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు.
పదహారు నెలలు జైలులో పెట్టి పార్టీని నాశనం చేసేందుకు ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. తనతో మొదటి నుండి ఉన్న ఇద్దరు ఎంపీలు, ఇరవై మంది ఎమ్మెల్యేలు తనను ఎప్పుడు విడిచి పెట్టలేదని చెప్పారు. చనిపోయిన తర్వాత కూడా తన ఫోటో ప్రతి ఇంట్లో ఉండాలనుకుంటానని, ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేపడతానని చెప్పారు.
నాలుగేళ్లుగా అనేక అంశాల పైన తామే పోరాటం చేశామని, బాధితులకు అండగా నిలబడ్డామన్నారు. టిడిపి గెలుపుకు, తమ ఓటమికి తేడా ఐదు లక్షలే అన్నారు. 9 మంది ఎంపీలు, 67 మంది ఎమ్మేల్యేలను దేవుడు కాపాడాడని, దేవుడు ఏమీ తక్కువ చేయలేదని చెప్పారు. చంద్రబాబు హామీలు ఇస్తున్నప్పుడు తనను కూడా అలాంటి హామీలు ఇవ్వాలని చాలామంది చెప్పారని, కానీ తాను అలా చేయలేదన్నారు.
రాజకీయాల్లో తాను నమ్మిన సిద్ధాంతం... విశ్వసనియత, విలువలు అన్నారు. మనిషిలో విశ్వసనీయత, విలువలు లేకుంటే సొంత భార్యకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఉంటుందన్నారు. సర్పంచ్ కూడా మన మాట వినరని, దానికి తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు. చేయలేని దానిని తాను చెప్పలేనని, లేనిపోని హామీలు ఇచ్చి... ఆ తర్వాత అమలు చేయకుంటే మూడు నెలలు తిరక్కముందే ప్రతి రైతు తనను తిట్టుకునేవాడన్నారు. ఏ గడ్డి తిన అయినా సిఎం పదవిలోకి రావాలని తనకు లేదన్నారు.