YS Jagan: ఫ్రస్ట్రేషన్ లో చంద్రబాబు -అందుకే అడ్డుకుంటున్నారు..! జగన్ ఫైర్..!
రాష్ట్రంలో దిగజారిన లా అండ్ ఆర్డర్, మోసాలు, అబద్ధాల మధ్య కొనసాగుతున్న పాలన నేపథ్యంలో జూన్ 4న వెన్నుపోటు దినం నిర్వహించినట్లు వైసీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. దీంతో డైవర్షన్ పాలిటిక్స్ తో పాటు అసహనంతో చంద్రబాబు కనిపిస్తున్నారన్నారు. అందుకే సీఎం చంద్రబాబు నియంతగా మారి అణచివేతకు నిర్వచనంగా కనిపిస్తున్నారన్నారు.
పొదిలిలో 40 వేల మంది పొగాకు రైతులు పాల్గొన్న కార్యక్రమంలో 40 మందితో గొడవ చేయించి కేసులు పెట్టడం చంద్రబాబుకే చెల్లిందని జగన్ ఆరోపించారు. ఎందుకింత అసహనం అని ఆయన్ను ప్రశ్నించారు. నిన్న కూడా సత్తెనపల్లికి వెళ్తే అడుగడుగునా అడ్డంకులు కల్పించారన్నారు. తనను చూసి చంద్రబాబు ఎందుకింత భయపడుతున్నారని ప్రశ్నించారు. ఏ పంటకూ మద్దతు రావట్లేదని, రైతులు అష్టకష్టాలు పడుతున్నారని గుర్తుచేశారు. పల్నాడులో ఈ మధ్యే ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ప్రకాశం జిల్లాలోనూ ఐదుగురు రైతులు చనిపోయారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

76 ఏళ్ల వయస్సున్న సీఎం చంద్రబాబు ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తానంటూ విపక్షాన్ని హెచ్చరించడం ఏంటని జగన్ ప్రశ్నించారు. ఈ వయస్సులో రెడ్ బుక్ పాలనేంటి, వాడిని, వీడిని తొక్కుతా అన్న మాటలేంటని అడిగారు. దేవుడి దయతో ప్రజలు అధికారమిస్తే మంచి చేయాల్సింది పోయి, హామీలు నిలబెట్టుకోవాల్సింది పోయి భూస్థాపితం చేస్తాననడం ఏంటన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చూడని విధంగా వ్యతిరేకతను చంద్రబాబు సర్కార్ ఎదుర్కొంటోందన్నారు. వైసీపీ నాయకులపై తప్పుడు కేసులు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. ఎవరూ గళం విప్పకూడదన్న ఉద్దేశంతో తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు.
ఈ తప్పుడు కేసుల సంప్రదాయాన్ని మరింతగా కొనసాగిస్తూ సత్తెనపల్లి టూర్ కు ముందు డైవర్షన్ పాలిటిక్స్ కోసం వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేశారన్నారు. గతంలో ఎప్పుడైనా చెవిరెడ్డి పేరు లిక్కర్ లో వినిపించిందా అని ప్రశ్నించారు. భాస్కర్ రెడ్డిని ఇరికించేందుకు తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారన్నారు. ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని మాజీ గన్ మెన్ అయిన కానిస్టేబుల్ ను కొట్టారన్నారు. తప్పుడు వాంగ్మూలం ఇవ్వలేనని చెప్పినందుకు చిత్రహింసలు పెట్టారన్నారు. దీనిపై అతను డీజీపీకి, గవర్నర్, రాష్ట్రపతికి లేఖలు రాశాడన్నారు. కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారన్నారు.
చెవిరెడ్డిని అరెస్టు చేసేందుకు తప్పుడు సాక్ష్యాలు సృష్టించారని, ఇలాంటి చర్యల వల్లే నక్సలిజం పుడుతుందన్నారు. చంద్రగిరి తన పూర్వీకుల నియోజకవర్గం కాబట్టి అక్కడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారని జగన్ ఆరోపించారు. మాచర్లలో అజమాయిషీ కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, మాజీ ఎంపీ నందిగం సురేష్ ను సైతం ఇలాగే టార్గెట్ చేసి అరెస్టులు చేశారన్నారు. వల్లభనేని వంశీపైనా ఇలాగే ఓ కేసులో బెయిల్ వస్తే మరోసారి వరుస కేసులు పెట్టారన్నారు.
జోగి రమేష్ కుమారుడిని, కాకాణి గోవర్ధన్ రెడ్డిని, తన మాజీ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డిని, ధనుంజయ్ రెడ్డిని ఇలాగే వేధించారన్నారు. వీరంతా మచ్చలేని అధికారులన్నారు. పేర్ని నానిని, పెద్దిరెడ్డిని, మిథున్ రెడ్డిని, సజ్జల రామకృష్ణారెడ్డిని, భార్గవ్ రెడ్డిని, వైవీ సుబ్బారెెడ్డిని, ఆయన కుమారుడిని, దేవినేని అవినాష్ తలశిల రఘురాం, ఆర్కే, అంబటి రాంబాబు, విడదల రజనీ, దళిత ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఉషాశ్రీచరణ్, తోపుదుర్తి ప్రకాష్, గోరంట్ల మాధవ్, గౌతం రెడ్డి, దాడిశెట్టి రాజా, మేరుగ నాగార్జున, ఇలా ప్రతీ ఒక్కరిపైనా తప్పుడు కేసులు పెట్టారన్నారు. జగన్ చుట్టూ ఉన్న వారందరినీ బెదిరించి భయపెట్టాలని చూస్తున్నారన్నారు. ఇలా చిన్న చిన్న నేతల్ని భయపెట్టి, కేసులు పెట్టి తనను భయపెట్టాలని చూస్తున్నారన్నారు.
ఏం పాపం చేశాడని సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును చంద్రబాబు జైలుకు పంపారన్నారు. ఓ డిబేట్ జరిగినప్పుడు ప్యానలిస్టులు మాట్లాడిన మాటలకూ ఆయనకూ ఏం సంబంధం అని ప్రశ్నించారు. కొమ్మినేనిపై చంద్రబాబుకు పాత కోపం ఉందని, ఆయన ఉద్యోగం పీకించిన చరిత్ర కూడా ఉందన్నారు. ఆయన ఉద్యోగం పీకి జైల్లో పెట్టించాలన్న దిక్కుమాలిన ఆలోచనలు చంద్రబాబువన్నారు. కొమ్మినేనిని అరెస్టు చేసి సాక్షి ఆస్తుల్ని ధ్వంసం చేశారన్నారు. వీటికి సంబంధించిన ఫొటోల్ని కూడా ప్రదర్శించారు.
సాక్షిపై చేసిన దాడులు చెడు సంప్రదాయమని, ఇలా విచ్చలవిడి రౌడీయిజం చేస్తే తమకు వ్యతిరేకంగా ఉన్న వారు భవిష్యత్తులో బతుకుతారా అని జగన్ ప్రశ్నించారు. తమకు వ్యతిరేకంగా రాసినా, చూపించినా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారన్నారు. నిజంగానే మహిళల పట్ల గౌరవం ఉందా అని చంద్రబాబును ప్రశ్నించారు. సత్యసాయి జిల్లా రాప్తాడులో 9వ తరగతి చదువుతున్న దళిత బాలికను టీడీపీకి చెందిన 14 మంది సామూహిక అత్యాచారం చేస్తే, బాలిక గర్భవతి అయినా ఫిర్యాదు ఇవ్వనీయకుండా భయపెట్టాలని చూశారన్నారు. దళిత బాలిక కేసులో చట్టప్రకారం చర్య తీసుకునే దమ్ము చంద్రబాబుకు ఎందుకు లేదన్నారు. అదే అనంతపురంలో గిరిజన ఇంటర్ విద్యార్ధిని తన్మయిని చంపేశారన్నారు. కుప్పంలోనూ ఓ మహిళను చెట్టుకు కట్టేసి కొడితే దిక్కులేదన్నారు. విమర్శలు వచ్చాక 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చారన్నారు.












Click it and Unblock the Notifications