రెక్కలు విరిచేస్తున్న కూటమి? అయినా జగన్ మౌనం వెనుక?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహిత నేతలుగా పేరున్న విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కూటమి ప్రభుత్వం కొరడా ఝళిపించింది. విజయసాయిరెడ్డిని పైకి చెప్పకుండానే బీజేపీ ద్వారా ఒత్తిడి తెచ్చి ఎంపీ పదవికి రాజీనామాతో పాటు ఏకంగా రాజకీయాలకే దూరం చేసేసిన కూటమి.. ఇప్పుడు మరో నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సైతం వేటాడుతోంది. అయితే ఇంత జరుగుతున్నా అధినేత జగన్ మౌనం ఇప్పుడు పార్టీ శ్రేణుల్ని కలచివేస్తోంది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ అమలు కోసం దాన్ని కనిపెట్టిన నారా లోకేష్ పై తీవ్ర ఒత్తిడి ఉంది. అలాగని దాన్ని బహిరంగంగా అమలు చేయడం మొదలుపెడితే కొత్త సమస్యలు తప్పవు. దీంతో తాము చేయాల్సిన పనుల్ని మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన ద్వారా చేయించేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే వైసీపీకి తాజాగా రెండు పెద్ద ఎదురుదెబ్బలు తగిలాయి. వీటిలో జగన్ కు ఆప్తులైన ఇద్దరు నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

ముఖ్యంగా జగన్ తర్వాత పార్టీలో నంబర్ టూ స్ధానం కోసం పోటీ పడే నేతల్లో ముందుండే విజయసాయిరెడ్డి ఏకంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పి వెళ్లిపోయారు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అటవీ భూముల కబ్జా కేసులో పవన్ కళ్యాణ్ వెంటాడుతున్నారు. దీంతో పెద్దిరెడ్డిపై కొరడా ఝళిపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం పెద్దిరెడ్డి భూముల అక్రమణలపై విచారణ కమిటీ వేసింది. దీని రిపోర్ట్ రాగానే చర్యలు తీసుకోవడం ఖాయం.
అయితే తనకు కీలకమైన ఇద్దరు నేతల్ని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసినా, అందులో ఒకరిని ఇప్పటికే రాజకీయాలకే దూరం చేసేసినా జగన్ మాత్రం విదేశాల్లో మౌనంగా గడిపేస్తున్నారు. ఇప్పటివరకూ ఈ రెండు వ్యవహారాలపై ఒక్క ప్రకటన కూడా చేయలేదు. వారికి మద్దతుగా ఒక్క మాటా మాట్లాడటం లేదు. జగన్ కు ఇంత సన్నిహితంగా నేతల పరిస్ధితే ఇలా ఉంటే తమ పరిస్ధితి ఏంటన్న భావన సగటు వైసీపీ కార్యకర్తలో కనిపిస్తోంది. దీంతో క్షేత్రస్దాయిలో పోరాటాలకు జగన్ ఇచ్చిన పిలుపుకు సైతం స్పందించే వారు కరువవుతున్నారు. గతంలో మంత్రులుగా ఉన్న వారు, సలహాదారులుగా ఉన్న వారు, వైసీపీ ప్రాంతీయ ఇన్ ఛార్జ్ లుకా పనిచేసిన వారూ మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. బీజేపీ భయమే వీరందరినీ వెంటాడుతున్నట్లు అర్దమవుతోంది.












Click it and Unblock the Notifications