శోభమ్మ చనిపోతే మేమంతా వెళ్లాం: భూమా ఫిరాయింపుపై జగన్ ఆవేదన
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీలోకి భూమా నాగిరెడ్డి చేరికపై వైయస్ జగన్ స్పందించారు. మంగళవారం ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బాగా దగ్గరగా, కుటుంబం అనుకున్న మనుషులకు మంత్రి పదవి ఎరచూపి తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకున్నారని మండిపడ్డారు.
భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీలోకి చేరడం చాలా బాధగా అనిపిస్తోందన్నారు. శోభా నాగిరెడ్డి అంత్యక్రియలకు తన తల్లి, భార్య, షర్మిలతో కలిసి వెళ్లామని చెప్పుకొచ్చారు. చంద్రబాబును చూసి సిగ్గుపడాలన్నారు. ఫిరాయింపులను చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తున్న తీరు చూస్తుంటే బాధగా ఉందన్నారు.
నాతో కలిపి వైసీపీలో మొత్తం 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అన్నారు. చంద్రబాబుతో పాటు ఆయన మంత్రులు, ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగినా కేవలం నలుగురు ఎమ్మెల్యేలను మాత్రమే తీసుకునిపోయాడన్నారు. మిగిలిన 63 మంది ఎమ్మెల్యేలకు తాను హ్యాట్సఫ్ చెబుతున్నాన్నారు.
ప్రలోభాలకు లొంగకుండా ప్రజల పక్షాన నిలబడ్డారన్నారు. వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. నలుగురు ఎమ్మెల్యేలను పట్టపగలు కోట్లకు డబ్బులు ఎరచూపి, మంత్రి పదవులు ఇచ్చి ప్రజాస్వామాన్యాని అవహేళన చేశారన్నారు.
చంద్రబాబును జైల్లో పెట్టాలి
కాపు ఐక్య గర్జన సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా తునిలో జరిగిన సంఘటనలపై సిబిఐ విచారణ జరిపించాలని ప్రణబ్ ముఖర్జీని కోరినట్లు జగన్ తెలిపారు. కాపు గర్జనలో చంద్రబాబు తప్పులు చేసి, అవి ఇతరులపై నెట్టేస్తున్నారని అన్నారు. తుని ఘటనలో రైల్వే ట్రాక్ దగ్గర్లో బహిరంగ సభకు అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
మూకుమ్మడిగా ఆందోళన సభ నిర్వహిస్తున్నప్పుడు ముందు జాగ్రత్తగా బందోబస్తు ఎందుకు చేపట్టలేదని ఆయన నిలదీశారు. ఇవేవీ చేయని చంద్రబాబు, తప్పును తమ పార్టీ నేతలపై తోస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ విషయంలో చంద్రబాబును జైళ్లో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన అన్నారు.
జీవితమంతా వెన్నుపోట్లే
చంద్రబాబునాయుడు జీవితం మొత్తం ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాక్కుంటూనే రాజకీయం చేశాడని అన్నారు. చంద్రబాబు జీవిత కాలం మొత్తం ఇలాగే సాగిందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి కుట్రతోనే సొంత మామను వెన్నుపోటు పొడిచాడని ఆయన చెప్పారు. ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తీసుకున్నారని ఆయన పేర్కొన్నాడు. అదే తానైతే, ఇలా పార్టీ మారిన వారిని, ముందున్న పార్టీ నుంచి తొలిగించి, ప్రజల్లోకి పంపి, వారి మద్దతుతో గెలిపించుకుని, పదవులు ఇచ్చేవాడినని ఆయన తెలిపారు.
తనను తప్ప తన పార్టీకి చెందిన 66 మంది శాసనసభ్యులను చంద్రబాబు ప్రలోభ పెట్టారని, అంత చేసినా నలుగురు మాత్రమే వెళ్లారని, తనతో పాటు ఉన్న 62 మంది శాసనసభ్యులకు హ్యాట్సాఫ్ అని అన్నారు. మంత్రి పదవులను ఎర చూపి భూమా నాగిరెడ్డిని చేర్చుకున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో కెసిఆర్, కెటిఆర్ ఎలా పార్టీలోకి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను రాబడుతున్నారో చూసి నేర్చుకోవాలని చంద్రబాబు మంత్రులకు చెప్పారని ఆయన అన్నారు.
చంద్రబాబు ఎన్నిసార్లు ఢిల్లీకి వచ్చినా ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని అడగడం లేదని ఆయన అన్నారు. చంద్రబాబు, కెసిఆర్ రాజీ పడ్డారని ఆయన అన్నారు. ఎపిలో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. జెన్కో అవినీతి పెచ్చరిల్లిందని అన్నారు.
నేనలా అనలేదు
తానేదో టిడిపి ఎమ్మెల్యేలను తీసుకుని ప్రభుత్వాన్ని పడగొడుతానని అన్నట్లు చంద్రబాబు తన పనిని సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించరారు. ప్రభుత్వాన్ని పటగొట్టే ఆ నెంబర్ తన దగ్గర లేదని చెప్పానని. తాను అన్న మాటను చంద్రబాబు నాయుడు వక్రీకరిస్తూ నిస్సిగ్గుగా తాను చేసిన కుట్రను కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ అన్నారు.
మూడేళ్ల తర్వాత క్యూ కడతారు
మూడేళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు తన వద్ద క్యూకడుతారని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై విపరీతమైన ప్రజా వ్యతిరేకత ఉందని, దాంతో టిడిపి నాయకులు తన వద్ద క్యూ కడుతారని ఆయన అన్నారు. ప్రజా వ్యతిరేకతను చంద్రబాబు మూటగట్టుకోక తప్పదని అన్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆయన అన్నారు.
ఇంతకు ముందు ఇద్దరు పార్లమెంటు సభ్యులు ఎస్పీవై రెడ్డి, గీతలను తమ పార్టీ నుంచి టిడిపిలోకి చంద్రబాబు తీసుకున్నారని, ఇప్పుడు నలుగురు శాసనసభ్యులను తీసుకున్నారని, వాటన్నింటికీ ఉప ఎన్నికలు వస్తాయని, అప్పుడు తమ సత్తా చాటుతామని ఆయన అన్నారు.
ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేలా చూడాలని రాష్ట్రపతిని కోరినట్లు ఆయన తెలిపారు. తమ విజ్ఞప్తికి రాష్ట్రపతి సానుకూలంగా ప్రతిస్పందించారని ఆయన అన్నారు. చంద్రబాబు రైతులను మోసం చేశారని ఆయన అన్నారు. చంద్రబాబు స్కాంలపై విచారణ జరిపించాలని రాష్ట్రపతిని కోరినట్లు తెలిపారు.