బీజేపీకి జగన్ మరో షాక్- అమిత్ షా శ్రీశైలం టూర్ కు డుమ్మా- మంత్రితోనే సరి-సర్వత్రా చర్చ
ఏపీలో 2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీతో, కేంద్ర ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్న సీఎం వైఎస్ జగన్ ఈ మధ్య కాలంలో అసహనంగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా రఘురామకృష్ణంరాజు అనర్హతతో పాటు ఏపీకి రావాల్సిన విభజన హామీలు, ఇతరత్రా అంశాల్లో కేంద్రం నుంచి మద్దతు కరువవుతున్న పరిస్ధితుల్లో జగన్ కాషాయ దళానికి దూరమవుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. తాజాగా కేబినెట్ భేటీలో మంత్రులకు బీజేపీపై ఎదురుదాడి మొదలుపెట్టాలని దిశానిర్దేశం చేసిన జగన్... ఇవాళ శ్రీశైలంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనకు దూరంగా ఉన్నారు.
బీజేపీ, వైసీపీ సంబంధాలు
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీతో పాటు కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ సత్సంబంధాలు కొనసాగిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ కలిసి పనిచేసిన చరిత్ర లేకపోయినా సుదీర్ఘ అనుబంధం ఉందనేలా ప్రతీ విషయంలోనూ జగన్ బీజేపీకి అండగా నిలిచారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలతో పాటు పార్లమెంటులో కీలక బిల్లుల విషయంలోనూ జగన్ బీజేపీకి బేషరతుగా మద్దతు ప్రకటించారు. పలుమార్లు అడగకపోయినా ఎన్డీయే వైఖరికి జాతీయ స్ధాయిలో మద్దతు కూడా ఇచ్చారు. దీంతో ఎన్డీయే ప్రత్యర్ధులకు సైతం కంటగింపుగా మారిపోయారు.
బెడిసికొట్టిన స్నేహం
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత రెండేళ్లకు పైగా కేంద్రంలోని బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న వైసీపీ ఏ విషయంలోనూ లబ్ది చేకూరలేదు. ఏపీకి గతంలో ఇచ్చిన విభజన హామీలతో పాటు ఆర్ధిక సాయం విషయంలోనూ కేంద్రం నుంచి మొండిచేయి ఎదురవుతోంది. అదే సమయంలో రాష్ట్రంలోనూ మత పరమైన వివాదాల్ని తెరపైకి తెస్తూ బీజేపీ జగన్ సర్కార్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో సహజంగానే ప్రజల్లో జగన్ ప్రతిష్ట మసకబారుతోంది. ఎన్డీయేకి ఇంత బహిరంగంగా మద్దతిస్తున్నా తమకు ఏమాత్రం లబ్జి చేకూరకపోవడంతో జగన్ అసహనంగా కనిపిస్తున్నారు.
బీజేపీకి జగన్ షాకులు
ఇన్నాళ్లూ బీజేపీ చెప్పినట్టల్లా ఆడుతూ.. ఏపీకి గతంలో కేంద్రం ఇచ్చిన హామీల్ని గుర్తు చేయడానికే పరిమితమైన జగన్...
తాజాగా తన స్టాండ్ మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్రాల్లో బీజేపీకి మద్దతుగా నిలుస్తున్న తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని అసహనంగా ఉన్న వైసీపీ అధినేత జగన్ తాజాగా తన వైఖరి మార్చుకున్నట్లు అర్ధమవుతోంది. ఈ మధ్య జరిగిన కేబినెట్ భేటీలో మంత్రులకు బీజేపీపై ఎదురుదాడి చేయాలని సంకేతాలు ఇచ్చిన జగన్.. త్వరలో బీజేపీకి మరిన్ని షాకులు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ ఏపీకి వస్తున్నా వైసీపీ పట్టించుకునే పరిస్ధితుల్లో లేదు.
అమిత్ షా శ్రీశైలం టూర్
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ ఏపీలో పర్యటించబోతున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ లోని బేగం పేట్ ఎయిర్ పోర్టుకు వచ్చి అక్కడి నుంచి ఏపీలోని శ్రీశైలానికి ప్రత్యేక విమానంలో రాబోతున్నారు. మధ్యాహ్నం 12.40 నుంచి 1.40 గంటల మధ్య ఆయన కుటుంబసభ్యులతో భ్రమరాంబదేవి, మల్లికార్జున స్వామివార్లను దర్శనం చేసుకోనున్నారు. అనంతరం భ్రమరాంబిక గెస్ట్హౌస్కు చేరుకుని భోజనం చేస్తారు. తర్వాత 2.40కి శ్రీశైలం నుంచి బయలుదేరి బేగంపేట వెళతారు. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లిపోనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరుకానున్నారు.
అమిత్ షా టూర్ కు జగన్ డుమ్మా
ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీశైలం పర్యటనకు వస్తున్నా సీఎం హోదాలో జగన్ ఆయన్ను రిసీవ్ చేసుకునేందుకు వెళ్లరాదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆయన టూర్ కు కూడా పూర్తిగా దూరంగా ఉండిపోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేవలం దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాత్రమే అమిత్ షా టూర్ లో కనిపించబోతున్నారు. మరికొందరు అధికారులతో కలిసి ఆయన అమిత్ షా పర్యటనలో పాల్గొనబోతున్నారు. సహజంగా అయితే కేంద్రంలో వీఐపీగా ఉన్న అమిత్ షా వంటి నేత రాష్ట్ర పర్యటనకు వస్తున్నప్పుడు సీఎం హోదాలో ఉన్న వ్యక్తులు అధికారికంగానే స్వాగతం పలుకుతారు. దగ్గరుండి మరీ పర్యటనలు విజయవంతం అయ్యేలా చూస్తారు. కానీ సీఎం జగన్ మాత్రం ఈసారి అమిత్ షాను పట్టించుకోకుండా దూరంగా ఉండిపోవడం రాష్ట్రంలో చర్చనీయాంశమవుతోంది. బీజేపీ, వైసీపీ మధ్య మారిన సంబంధాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే వైసీపీ, బీజేపీ నేతలిద్దరూ దీనిపై నోరు మెదపడం లేదు.
ఢిల్లీలో అపాయింట్మెంట్లకు ఎదురుచూపులు
ఏపీకి సంబంధించిన ఏ విషయంపై చర్చించాలన్నా ముందుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్దకే సీఎం జగన్ వెళుతుంటారు. ఆయన అపాయింట్మెంట్ కోసం ఎదురుచూపులు కూడా తప్పడం లేదు. గతంలో అపాయింట్ మెంట్ ఇచ్చి ఢిల్లీకి పిలిపించినా దర్శనమివ్వకుండా అమిత్ షా జగన్ ను వెనక్కి పంపేసిన సందర్భాలూ ఉన్నాయి. చాలా సార్లు అపాయింట్ మెంట్ దొరికినట్లే దొరికి తప్పిన సందర్భాలూ లేకపోలేదు. అలా ఢిల్లీలో అమిత్ షా అపాయింట్మెంట్ల కోసం విశ్వప్రయత్నాలు చేసే జగన్.. ఇప్పుడు రాష్ట్రానికి ఆయన వస్తుంటే మాత్రం దూరంగా ఉండిపోవడం ప్రతికూల సంకేతాలు పంపుతోంది.
Recommended Video
కాషాయ బంధం తెంచేసుకుంటారా ?
రెండేళ్లుగా బీజేపీతో, కేంద్రంలో పెద్దలతో సత్సంబందాలు నెరుపుతున్నా తమకు ఒరిగిందేమీ లేదని, అదే సమయంలో బీజేపీ సహాయనిరాకరణ, ఎదురుదాడులు తమకు ఇబ్బందికరంగా తయారయ్యాయని జగన్ భావిస్తున్నారు. ముఖ్యంగా తమకు నిద్ర లేకుండా చేస్తున్న రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు కూడా వేయించుకోలేని దుస్ధితిలో ఉండటం వైసీపీ పెద్దల్ని కలవరపెడుతోంది. అందుకే ముందుగా రాష్ట్రంలో బీజేపీపై వార్ మొదలుపెట్టేందుకు వైసీపీ నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన జగన్ ఇప్పుడు.. ఏకంగా అమిత్ షా టూర్ కే డుమ్మాకొట్టేస్తున్నారు. తద్వారా బీజేపీ విషయంలో తమ వైఖరి మారిందని చెప్పేందుకు జగన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ దీన్ని ఏ విధంగా తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో సీబీఐ కేసుల సహా ఏ ప్రతికూల పరిణామం ఎదురైనా బీజేపీ సాయం కోరాల్సిన పరిస్ధితుల్లో జగన్ దూకుడు చూస్తుంటే 2010లో యూపీఏ సర్కార్, కాంగ్రెస్ పార్టీ పై ధిక్కారం గుర్తుకొస్తోందని వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.