ఏపీ సీఎంవోలో మార్పులు : జగన్ టీమ్ లోకి కొత్తగా ఇద్దరు ? మూడురోజుల్లో నిర్ణయం...
ఏపీలో ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్కరణలను పరుగులు పెట్టించాలని భావిస్తున్న సీఎం జగన్ అందుకు తగ్గట్టుగా తన టీమ్ లో మార్పులు చేసుకుంటున్నారు. ఇప్పటికే సీఎంవోలో ముగ్గురు రిటైర్డ్ అధికారులను కీలక బాధ్యతల నుంచి తప్పించిన జగన్.. వారి స్ధానంలో మరో ఇద్దరు చురుకైన అధికారులను తీసుకోవచ్చనే ప్రచారం సాగుతోంది. వీరి రాకతో సీఎంవో పాలన వేగవంతం కావడంతో పాటు ప్రభుత్వంపై సానుకూల సంకేతాలు పంపాలనేది జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. ఇప్పటికే నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లు ఇందుకోసం వినిపిస్తుండగా... వీరిలో ఇద్దరిని ఖరారు చేయొచ్చని తెలుస్తోంది.

ఏపీ సీఎంవోలో మార్పులు...
వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్బంగా పాలనలో పలు కీలక మార్పులు చేపట్టాలని భావిస్తున్న సీఎం జగన్.. ముందుగా తన టీమ్ లోనే మార్పులకు సిద్దమయ్యారు. ఇప్పటికే సీఎంవో గతంలో తాను అనుభవం కోసం తెచ్చిపెట్టుకున్న ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను కీలక బాధ్యతల నుంచి తప్పించిన జగన్ వారి స్ధానాన్ని మరో ఇద్దరితో భర్తీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం తగిన వారిని ఎంపిక చేసుకునేందుకు ప్రభుత్వంలో ముఖ్యులతో జగన్ సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఏడాది పాలనలో ప్రభుత్వం చాలా విషయాల్లో మెరుగ్గా పనిచేస్తున్నట్లు పేరుతెచ్చుకున్నా కొన్ని అంశాల్లో లోటుపాట్లు ఇంకా వేధిస్తున్నాయి. వీటిని అధిగమించేందుకు సీనియర్లతో పాటు సమర్ధులైన అధికారుల అవసరం ఉందని జగన్ భావిస్తున్నారు.

రేసులో ఈ నలుగురు...
ఏడాది కాలంలో ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాల అమలు వెనుక కీలకంగా వ్యవహరిస్తున్న నలుగురు అధికారుల పేర్లు తాజాగా సీఎంవో రేసులో వినిపిస్తున్నాయి. వీరిలో సీనియర్ ఐఏఎస్ లు నాగులాపల్లి శ్రీకాంత్, విజయ్ కుమార్, కోన శశిధర్, శశిభూషణ్ కుమార్ పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా ఏడాదిగా ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక పథకాలు, కార్యక్రమాల్లో కీలకంగానే ఉన్నారు. విజయ్ కుమార్ వంటి వారైతే ప్రభుత్వానికి కొన్ని కీలక అంశాల్లో అన్నీ తానై వ్యవహరిస్తూ జగన్ దృష్టిలో సమర్ధుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. రాజధాని, సచివాలయాల పరీక్షలు, నియామకాలు వంటి అంశాల్లో విజయ్ కుమార్ సమర్ధంగా వ్యవహరించారు.
అలాగే విద్యుత్ శాఖలో నాగులాపల్లి శ్రీకాంత్, పౌరసరఫరాలు, ఐటీ వంటి అంశాల్లో కోన శశిధర్ మంచి పేరు తెచ్చుకున్నారు.

ఎంపిక గోప్యంగానే....
సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక.. కోన శశిధర్ను సీఎంవోలోకి తీసుకుంటారని ప్రచారం జరిగినప్పటికీ అప్పట్లో అది అమలు కాలేదు.
అదే విధంగా ఐఎఎస్ అధికారి విజయ్ కుమార్ అంటే జగన్ కు వల్లమాలిన అభిమానం.
నాగులపల్లి శ్రీకాంత్ పేరును కూడా పున:ప్రాతిపదిక మీద పరిశీలించే అవకాశాలున్నాయి.
ఒకవేళ సిఎంవోలోకి మరో తెలుగేతర ఐఎఎస్ అధికారిని తీసుకోవాలని సిఎం భావిస్తే.. శశిభూషణ్ కుమార్ను పరిశీలించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.. ఈ నలుగురిలో కోన శశిధర్, నాగులపల్లి శ్రీకాంత్ పేర్లు బాగా ప్రచారం అవుతున్నాయి.
సిఎం జగన్ ఆ ఇద్దరిని తీసుకుంటారా.. మరో ఇద్దరిలో ఎవరినైనా తీసుకుంటారా.. అనే విషయం బయట పడటం లేదు.
ఈ నలుగురు ఐఎఎస్ అధికారుల పేర్లు సచివాలయంలో ప్రచారం జరుగుతోంది.
జగన్ మనసులో ఏముందో బయట పడటం లేదు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసహానికి ఈ విషయం తెలియదట.
అదే విధంగా సిఎం కార్యాలయ ఇంఛార్జి ప్రవీణ్ ప్రకాష్ కూడా ఈ విషయంపై బయట పడకుండా మౌనం వహిస్తున్నారు.
Recommended Video

రెండు, మూడు రోజుల్లో నిర్ణయం
సీఎంవోలో అజేయ కల్లం, జె.మురళి, పీవీ రమేష్ ఖాళీ చేసిన స్ధానాలను భర్తీ చేసేందుకు తగిన వారి కోసం జగన్ వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. వీరి స్ధానాల్లో ఇద్దరు లేదా ముగ్గురిని కూడా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం రేసులో ఉన్న వారిలో కోన శశిధర్ కు బెర్తు ఖాయమే అంటున్నారు. ఆయనతో పాటు విజయ్ కుమార్, నాగులాపల్లి శ్రీకాంత్ కు ఖాయమయ్యే అవకాశం ఉంది. చివరి నిమిషంలో మార్పులు జరిగితే శశిభూషణ్ కుమార్ కు అవకాశం దక్కవచ్చు. ఏదేమైనా రెండు, మూడు రోజుల్లో ఈ వ్యవహారాన్ని తేల్చేయాలని జగన్ భావిస్తున్నట్లు తాజా సమాచారం.












Click it and Unblock the Notifications