బాబుపై పోరు: మరో దీక్షకు వైయస్ జగన్ రెడీ
హైదరాబాద్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు నిరసనగా జూన్ 5, 6 తేదీల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిర్ణయించింది. గుంటూరు- విజయవాడ మధ్య రెండు రోజులపాటు వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరసన దీక్ష చేపట్టనున్నారు.
పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆ వివరాలను ఆదివారంనాడు వెల్లడించారు. జిల్లా నేతలతో చర్చిస్తున్నామని, వేదిక, దీక్ష ప్రదేశాన్ని త్వరలో ఖరారు చేస్తామన్నారు. చంద్రబాబు ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు.
టిడిపి అధికారంలోకి వచ్చి ఏడాది ముగుస్తున్న సందర్భంగా వైసిపి శ్రేణులు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సమాయత్తం అవుతున్నారు. రాజధాని కోసం భూసమీకరణ, రైతుల్లో పెల్లుబుకుతున్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి వైసిపి ప్రయత్నిస్తోంది.
ఎన్నికల్లో రైతులు, డ్వాక్రా మహిళా సంఘాల రుణాలను మాఫీ చేస్తామని ఓట్లు దండుకున్న టిడిపి, ఇంతవరకు సంపూర్ణంగా హామీని నిలబెట్టుకోలేదని వైసిపి విమర్సిస్తోంది. ఆంధ్రకు ప్రత్యేక హోదా సాధించడంలో విఫలమైందన్న అభియోగంతో వైసిపి జనంలోకి వెళ్తోంది.
చంద్రబాబు రాజధాని కోసం నిధులు కావాలని, సింగపూర్, మలేషియా, జపాన్, చైనా పర్యటనలు చేసి ప్రజల సొమ్మును దుబారా చేశారని వైసిపి తీవ్రంగా విమర్శిస్తోంది. తాత్కాలిక రాజధానిని మంగళగిరి వద్ద ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించి, తర్వాత ఆ అంశాన్ని అటకెక్కించిన విషయం తెలిసిందే.
ఈ తరహా ప్రకటనలతో ప్రజలను గందరగోళపరుస్తున్న తెదేపా ద్వంద్వ విధానాలను బహిర్గతం చేస్తామని వైసిపి ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. రెండు రోజుల దీక్ష కంటే ముందు వైసిపి ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల మద్దతును కూడగట్టేందుకు త్వరలో కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేయనుంది.
నేటినుంచి భరోసా యాత్ర
కాగా, జగన్ రెండో విడత రైతు భరోసా యాత్రను అనంతపురం జిల్లాలో 11వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నారు. వివరాలను వైసిపి రైతు విభాగం అధ్యక్షుడు ఎంవిఎస్ నాగిరెడ్డి ప్రకటించారు. గిట్టుబాటు ధరలు లేక రైతాంగం తీవ్ర సంక్షోభంతో ఉందన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జగన్ మొదటి విడత రైతు భరోసా యాత్ర ఇదే జిల్లాలో ప్రారంభమైందన్నారు.