రేపు పోలవరానికి వైఎస్ జగన్-సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారి..
ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ కు మళ్లీ ప్రాణం వచ్చింది. కొంతకాలంగా నిలిచిపోయిన పోలవరం నిర్మాణానికి తిరిగి నిధులు కేటాయించేందుకు కేంద్రం ముందుకు రావడంతో ఈ ప్రాజెక్టు పనుల్ని సమీక్షించేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించి క్షేత్రస్ధాయిలో పనుల తాజా పరిస్ధితిని సీఎం జగన్ తెలుసుకోనున్నారు. దీంతో జగన్ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది.
పోలవరం ప్రాజెక్టు ఎత్తు, నిర్వాసితులకు పరిహారం విషయంలో తాజాగా ఢిల్లీలో జరిగిన కేంద్ర జల్ శక్తి శాఖ భేటీలో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఏపీ కోరినంత కాకపోయినా ప్రాజెక్టు పరిమాణం తగ్గించి నిధులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. అలాగే పరిహారం విషయంలోనూ కేంద్రం సూచించిన ఎత్తు వరకూ కడితే నిధులు ఇచ్చేందుకు సరేనంది. దీంతో రాష్ట్రం కూడా ఇప్పుడు తాజా పరిస్ధితిని సమీక్షిస్తోంది.

రేపు ఉదయం 9.30 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పోలవరం ప్రాజెక్ట్ వద్దకు సీఎం జగన్ చేరుకుంటారు. అక్కడ అధికారులతో కలిసి ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం పోలవరం ప్రాజెక్ట్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత సీఎం జగన్ మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
మరోవైపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 2025 జూన్ వరకూ గడువు పెంచిన ఏపీ ప్రభుత్వం, దాన్ని అంగీకరించాలని కేంద్రాన్ని కోరింది. దీంతో కేంద్రం కూడా విడదల వారీగా నిధులు కేటాయించేందుకు వెసులుబాటు లభించింది. ఈ నేపథ్యంలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తిపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.












Click it and Unblock the Notifications