జగన్ టి పర్యటన: వైఎస్ విగ్రహాల ధ్వంసం, రాళ్లకు పూజ
ఖమ్మం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో ఖమ్మంలో పలుచోట్ల దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను ధ్వంసం చేశారు. జిల్లాలోని కూసుమంచి మండలంలోని జీళ్ల చెరువు, కోక్యాతండాలలో వైయస్ విగ్రహాలకు మంగళవారం రాత్రి దగ్ధం చేశారు.
విగ్రహాలపై రాళ్లు పెట్టి నిప్పు అంటించడంతో పూర్తిగా కాలిపోయాయి. జగన్ జిల్లా పర్యటనను నిరసిస్తూ గుర్తు తెలియని వ్యక్తులు ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు. కాగా, జగన్ పర్యటనను నిరసిస్తూ ఖమ్మం జిల్లాలో తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి ద్విచక్ర వాహన ర్యాలీని నిర్వహించింది. మరోవైపు పోలీసులు పలువురిని ముందస్తుగా అరెస్టు చేశారు.
మరోవైపు జగన్ నేటి నుంచి తెలంగాణలో పర్యటించనున్నారు. జగన్ పర్యటనపై తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు నేతలు హెచ్చరించి, ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ఆయన తన పర్యటనకు సిద్ధమయ్యారు. జగన్ పర్యటిస్తే మానుకోట పునరావృతం అవుతుందని తెలంగాణవాదులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పలువురు తెలంగాణవాదులు మానుకోట నుండి రాళ్లు తెచ్చి పూజలు చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో టిడిపి వర్సెస్ వైయస్సార్ కాంగ్రెస్
పశ్చిమ గోదావరి జిల్లా మల్లేశ్వరంలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. జగన్ పర్యటన సందర్భంగా ఇది జరిగింది. పరస్పరం ఇరు పార్టీలు ఫ్లెక్సీలు చించుకున్నాయి.