పులివెందుల కోర్టు: జగన్ బాబాయి హత్య: సునీల్ యాదవ్కు 14రోజుల రిమాండ్, కడప జైలుకు తరలించిన సీబీఐ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడైన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్యోదంతంలో కీలక అనుమానితుడిగా ఉన్న సునీల్ కుమార్ యాదవ్ ను గోవాలో అరెస్టు చేసిన సీబీఐ అధికారులు ఇవాళ పులివెందుల కోర్టులో హాజరుపర్చారు..
వైఎస్ వివేకా హత్యకేసులో అనుమానితుడైన సునీల్పై ఐపీసీ 302 సెక్షన్ (హత్య) కింద సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. అనంతరం జడ్జి ఎదుట ప్రవేశ పెట్టారు. ఈ మేరకు విచారించిన జడ్జి.. సునీల్కు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీంతో సునీల్ను సీబీఐ అధికారులు కడప సెంట్రల్ జైలుకు తరలించారు.
వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు, పులివెందులకు చెందిన సునీల్ యాదవ్ను సీబీఐ అధికారులు గోవాలో అరెస్టు చేశారు. ఈ విషయాన్ని సీబీఐ అధికారికంగా ధృవీకరించింది. నిన్న సాయంత్రం గోవాలో అరెస్టు చేసిన అధికారులు గోవా స్థానిక కోర్టులో హాజరుపర్చి ట్రాన్సిట్ రిమాండ్లోకి తీసుకున్నారు. గోవా నుంచి కడపకు తీసుకువచ్చి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
వివేకా హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న సునీల్ను ఇప్పటికే పలుమార్లు సీబీఐ అధికారులు విచారించారు. తనను సీబీఐ వేధిస్తోందని, థర్డ్ డిగ్రీతో టార్చర్ పెడుతోందంటూ సునీల్ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశాడు. అనంతరం ఆయన పులివెందులలోని తన ఇంటికి తాళాలు వేసి పరారయ్యాడు. ఈ నేపథ్యంలో సునీల్ గోవాలో తలదాచుకున్నట్లు తెలుసుకున్న సీబీఐ అధికారులు గోవాకు వెళ్లి అరెస్టు చేశారు. గోవా స్థానిక కోర్టులో హాజరు పర్చిన అధికారులు ట్రాన్సిట్ రిమాండ్లోకి తీసుకున్నారు
హైకోర్టు ఆదేశాల మేరకు వివేకా హత్య దర్యాప్తును తలకెత్తుకున్న సీబీఐ కొన్నాళ్లు విచారణ జరిపి కరోనా కారణంగా ఆపేసి, రెండో దఫా దర్యాప్తుపే ప్రారంభించి, కడప కేంద్ర కారాగారం కేంద్రంగా 57 రోజులుగా విచారణ జరుపుతున్నది. అందులో భాగంగా పలువురు అనుమానితులను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా సునీల్ కుమార్ యాదవ్ ను అరెస్టు చేయడం గమనార్హం.
సునీల్ కుమార్ యాదవ్ దివంగత మాజీమంత్రి వైఎస్ వివేకాకు సన్నిహితంగా ఉండేవారు. అయితే ఆయన హత్యకేసులో భాగంగా సీబీఐ అధికారులు సునీల్ కుమార్ యాదవ్తోపాటు కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. అయితే ఇటీవలే వాచ్మెన్ రంగన్న సునీల్ కుమార్ యాదవ్ పేరు ప్రస్తావిస్తూ వాంగ్మూలం ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. దీంతో సీబీఐ ఆయనను అరెస్టు చేసింది.