వైసీపీకి విస్తరించిన జగన్ వర్సెస్ షర్మిల వార్-కీలకంగా కాంగ్రెస్ పాత్ర ..!
ఏపీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పిల్లలు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల ఇప్పుడు ఆస్తుల యుద్ధంలో మునిగి తేలుతున్నారు. ఇద్దరి మధ్య ఆస్తుల పంపకాలపై వైఎస్ బతికి ఉండగానే క్లారిటీ ఇచ్చేసినా ఇప్పటికీ వాటిపై వారిద్దరూ క్లారిటీకి రావడం లేదు. ముఖ్యంగా తనకు, పిల్లలకు రావాల్సిన ఆస్తుల్ని అన్న ఒక్కరే అనుభవిస్తున్నారన్న ఆక్రోశంతో షర్మిల జగన్ తో విభేదించి దూరమయ్యారు. అయితే తాజాగా చెల్లితో పాటు తల్లికి రావాల్సిన షేర్లు బదిలీ కాకుండా జగన్ ఎన్సీఎల్టీని ఆశ్రయించారు.
ఇంతవరకూ ఓ ఎత్తయితే తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు మరో ఎత్తుగా మారాయి. ముఖ్యంగా చెల్లి, తల్లితో నెలకున్న ఆస్తుల పోరును జాతీయ కంపెనీల లా ట్రైబ్యునల్ లో తేల్చుకునేందుకు సిద్ధమైన జగన్.. ఇందులోనూ రాజకీయాన్ని చొప్పిస్తున్నారు. తన చెల్లి, తల్లిని రాజకీయాలకు వాడుకుంటున్నారంటూ విజయనగరం జిల్లా గుర్లలో నిన్న జగన్ చేసిన వ్యాఖ్యలు, వాటికి కొనసాగింపుగా వైసీపీ నేత పేర్నినాని చేసిన వ్యాఖ్యలతో ఈ వ్యవహారాన్ని రాజకీయంగా లాగేందుకు జగన్ ప్రయత్నిస్తున్నట్లు అర్ధమైంది. అయితే జగన్ వ్యవహారం చూస్తున్న షర్మిల కూడా అన్నకు కౌంటర్ ఇచ్చారు.

మరోవైపు అన్నా, చెల్లి, తల్లి మధ్య సాగుతున్న పోరు ఇప్పుడు జగన్ చర్యలతో వైసీపీకి విస్తరించింది. కానీ అటు షర్మిల మాత్రం దీన్ని కాంగ్రెస్ కు అంటుకోకుండా జాగ్రత్త పడుతున్నారు. నిన్న విజయవాడలో కాంగ్రెస్ నేతలతో భేటీ నిర్వహించిన షర్మిల.. మీడియా జగన్ వ్యవహారంపై ప్రశ్నించినా ముక్తసరిగా సమాధానం ఇచ్చి సరిపెట్టారు. కానీ జగన్ మాత్రం వైసీపీ నేత పేర్నినానితో ప్రెస్ మీట్ పెట్టించి షర్మిలను, ఇతర రాజకీయ ప్రత్యర్థుల్ని తిట్టించారు.
తాజా పరిణామాల్ని బట్టి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ కూడా జగన్-షర్మిల వ్యవహారాన్ని కుటుంబ గొడవగానే చూస్తోందని అర్దమవుతోంది. కానీ జగన్ మాత్రం ఇందులోనూ రాజకీయం ఉందని భావిస్తున్నారు. ఆ రాజకీయం సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు జాతీయ స్దాయిలో కాంగ్రెస్ తో కూడిన ఇండియా కూటమిలో భాగస్వామి కావాలని కోరుకుంటున్న జగన్, ఢిల్లీలో తాను ధర్నా చేస్తే కాంగ్రెస్ రాలేదని బాధపడిన జగన్ ఇప్పుడు అదే కాంగ్రెస్ లో పీసీసీ ఛీఫ్ గా ఉన్న షర్మిలను రాజకీయంగా టార్గెట్ చేస్తుండటం చూస్తుంటే భవిష్యత్తులో ఆ పార్టీతో సంబంధాల గురించి ఆలోచించడం లేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications