మరో'సారీ': జగన్ వ్యాఖ్యతోనే యనమల ఝలక్: భూమా సహా వారు సేఫ్
హైదరాబాద్: ద్రవ్య వినిమయ బిల్లును మంత్రి యనమల రామకృష్ణుడు శాసన సభలో ప్రవేశ పెట్టారు. ఆ తర్వాత చర్చ జరిగింది. అనంతరం సభలో వైసిపి సభ్యులు డివిజన్ అడిగారు. దీనిపై యనమల స్పందించారు. ఇలాంటి సమయంలో డివిజన్ అడిగే అవసరం లేదన్నారు.
డిమాండ్లు అన్నీ పాస్ అయ్యాక డివిజన్ అడగటంలో అర్థం లేదన్నారు. అన్ని విషయాలు పాస్ అయ్యాయని, వారు అంగీకరించారని, అలాంటప్పుడు డివిజన్ ఎలా అడుగుతారన్నారు. ఇలాంటి సమయాల్లో ఇప్పటి వరకు భారత దేశ చరిత్రలో ఎవరూ డివిజన్ అడగలేదన్నారు.
తమ పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసుకుంటే తమకు అభ్యంతరం లేదని, ద్రవ్య వినిమయ బిల్లును మీరంతా ఆపోజ్ చేస్తే.. తెల్లారితే మీకు జీతాలు అవసరం లేదా అని ప్రశ్నించారు. ద్రవ్య వినిమయ బిల్లు పైన డివిజన్ అవసరం లేదన్నారు.
బిల్లును వ్యతిరేకిస్తే మీకు జీతాలు ఇవ్వవద్దా అని ప్రశ్నించారు. జడ్జిలకు, ఉద్యోగులకు ఎవరికీ వేతనాలు రావన్నారు. ద్రవ్య వినిమయ బిల్లు సమయంలో డివిజన్ అవసరం లేదని రాజ్యాంగం స్పష్టంగా చెప్పిందన్నారు. దీనిని పాస్ చేస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఇది పేదవాళ్లకు సంబంధించినదన్నారు.
మీరు జీతాలు ఇచ్చేందుకు వ్యతిరేకమా, మీకు రేపు జీతాలు వద్దా, పేదలకు వ్యతిరేకమా.. అందుకే డివిజన్ కోరుతున్నారా అని ప్రశ్నించారు. మా వాళ్లను కాపాడేందుకు అవిశ్వాస తీర్మానం పెట్టానని ఇటీవల జగన్ శాసన సభ సాక్షిగా ప్రకటించారని యనమల గుర్తు చేశారు.
ఇప్పుడు మీ వాళ్లను కాపాడుకునేందుకే డివిజన్ అడుగుతున్నట్లుగా కనిపిస్తోందన్నారు. నాడు అవిశ్వాసం, ఇప్పుడు డివిజన్.. మీ వాళ్లు పారిపోకుండానే కాబట్టి, అనవసరమని చెప్పారు. మీ వాళ్లు పారిపోకుండా చేసేందుకు ద్రవ్య వినిమయ బిల్లు పైన డివిజన్ అవసరం లేదన్నారు.
డివిజన్ కోరితే స్పీకర్ తిరస్కరించవచ్చునని చెప్పారు. ద్రవ్య వినిమయ బిల్లుతో వెళ్లడం సరికాదని, వాయిస్ ఓటుతో వెళ్లాలని యనమల సభాపతిని కోరారు. మీ వాళ్లు పారిపోకుండా కాపాడుకునేందుకు డివిజన్ అడగడం సరికాదన్నారు.
జగన్ మాట్లాడుతూ... తమకు డివిజన్ అడిగే అధికారం తమకు ఉందని చెప్పారు. వీరు తమ ఎమ్మెల్యేలను డబ్బులు పెట్టి కొన్నారని జగన్ ఆరోపించారు. అవినీతి డబ్బుతో ఎమ్మెల్యేలను కొన్నారన్నారు. సభను దారుణంగా నడుపుతున్నారన్నారు. మూజువాణి అర్హత ఉన్న ప్రశ్నకు డివిజన్ అడగవచ్చునని చెప్పారు.
యనమల మాట్లాడుతూ.. జగన్ ఇంటెన్షన్ అందరికీ అర్థమైందని చెప్పారు. డివిజన్ కోరే హక్కు లేదన్నారు. డివిజన్ అవసరం లేదన్నారు. సభను రాజకీయాలకు వేదికగా ఉపయోగించుకోవడం సరికాదన్నారు. ప్రతిపక్షానికి బలం కూడా లేదన్నారు.
దీనిపై స్పీకర్ మాట్లాడుతూ... ఇది రాజకీయ వేదిక కాదని చెప్పారు. ఓటింగు పైన నిపుణులతో సంప్రదించానని చెప్పారు. అనంతరం విపక్షాల నినాదాల మధ్యనే ద్రవ్య వినిమయ బిల్లు పాస్ అయింది. అనంతరం శాసన సభ నిరవధిక వాయిదా పడింది.
తద్వారా, ఓటింగుతో తమ పార్టీ నుంచి టిడిపిలో చేరిన భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ, ఆదినారాయణ రెడ్డి తదితర ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా ఒత్తిడి పెంచాలనుకున్న జగన్ ఆశలు నీరుగారిపోయాయి.
ప్రజాప్రతినిధుల జీతాల పెంపుపై స్వల్ప వాగ్వాదం
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాల పెంపు పైన అసెంబ్లీలో స్వల్ప వాగ్వాదం జరిగింది. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, వారికి కూడా అవసరమైన మేర పెంచాలని వైసిపి ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. దీనిపై మంత్రి యనమల మాట్లాడుతూ... ఎమినిటిస్ కమిటీ ప్రతిపాదనల మేరకు జీతాలు పెంచామన్నారు.
జగన్ మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధుల జీతాలు పెంపు విషయంలో ఏర్పాటు చేసిన కమిటీలో తమ పార్టీ సభ్యులు కూడా ఉన్నారని, కాబట్టి జీతాల పెంపును తాను వ్యతిరేకించడం సరికాదన్నారు. కానీ ఎమ్మెల్యేలకు జీతాలు పెంచుతూనే, ఏమైనా తగ్గించే పరిస్థితులు ఉంటే చూడాలన్నారు.
ఎందుకు దాచి పెట్టారు: కాకాని
2016-17 బడ్జెట్ అంతా తప్పులతడకేనని వైసిపి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు చెప్పిన ఎన్నో హామీలు నెరవేర్చడం లేదన్నారు. జీడీపీ పైన తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. పోలవరంపై ప్రభుత్వం చెప్పే మాటలు నమ్మశక్యంగా లేవన్నారు. దీనిపై ప్రభుత్వానిది డబుల్ గేమ్ అన్నారు.
చంద్రబాబును నమ్మి రైతులు, మహిళలు, ఇలా ఎందరో బాధపడుతున్నార్నారు. వ్యవసాయ రుణ మాఫీ పైన తొలి సంతకం చేసిన చంద్రబాబు.. వాటిని ఇప్పటి దాకా మాఫీ చేయలేకపోయారన్నారు. బడ్జెట్ అంచనాలకు, వాస్తవాలకు ఎక్కడా పొంతన లేదన్నారు.
2014 - 15 బడ్జెట్ లెక్కలు ఎందుకు దాచి పెట్టారని ప్రశ్నించారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి వ్యవసాయాన్ని పండుగ చేసి చూపించారన్నారు. వైయస్ సీఎం అయ్యాక రైతులకు ఉచిత విద్యుత్ అందించే ఫైలు పైన తొలి సంతకం చేశారని, తుది శ్వాస విడిచే వరకు దానిని కొనసాగించారన్నారు.