మీ కోసమే వచ్చా, కలిసే ఉండాలి: ఇరువర్గాలకు జగన్ హిత బోధ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో పర్యటించారు.
పశ్చిమగోదావరి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో పర్యటించారు. సాంఘిక బహిష్కరణ ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడారు.
ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఇక్కడకు వచ్చానని జగన్ చెప్పారు. తాను రెండు పక్షాలతోనూ మాట్లాడతానని, సమాజంలో అంతా కలిసి ఉండాలన్నదే తన భావన అని చెప్పారు. ఇందు కోసమే ఈ ప్రయత్నమన్నారు. ప్రతి కులంలో మంచి, చెడు రెండు ఉంటాయని, ఎవరో ఒకరు చేసిన తప్పును ఆ కులం అంతటికీ ఆపాదించడం సరికాదని హితవు పలికారు.
ఇది అన్నివర్గాలకు వర్తిస్తుందన్నారు. ఒకవేళ పొరపాటు జరిగి ఉంటే.. దాన్ని సరిదిద్దుకుందామని, దానివల్ల ఔన్నత్యం పెరుగుతుందే తప్ప తగ్గదని జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా గరగపర్రు దళితేతరులు మాట్లాడుతూ.. సోదరభావంతోనే తాము బతకాలనుకుంటున్నామన్నారు.
కొందరు వల్ల ఈ సమస్య వచ్చిందని, తమ గ్రామం ఆదర్శ గ్రామంగా ఇప్పటివరకూ నిలిచిందన్నారు. సమస్యను గ్రామస్తులకే వదిలేస్తే వెంటనే పరిష్కారం అవుతుందన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి ఎలాంటి ఇబ్బంది లేదని, తప్పులు రెండువైపులా ఉన్నాయని వివరించారు.
ఊరంటే అందరూ ఉండాలని, అంతా కలిసే ఉండాలని జగన్ అన్నారు. ఈ సందర్భంగా గరగపర్రులో సాంఘిక బహిష్కరణకు గురైన దళితులను పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగితెలుసుకున్నారు. తమను అన్యాయంగా సాంఘిక బహిష్కరణ చేశారని, పనుల్లో నుంచి తొలగించారని దళితులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడమే తమ పొరపాటా అని వారు ప్రశ్నించారు. 50ఏళ్లుగా ఇతర కులాలతో బంధువుల్లా మెలిగామని, గత 3నెలలుగా వివాదం జరుగుతుంటే సీఎం చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. స్థానిక నేతలతోపాటు అధికారులు కూడా తమను పట్టించుకోలేదన్నారు.
అనంతరం జగన్ మాట్లాడుతూ.. సమాచార లోపం వల్లే వివాదం జరిగిందని దళితేతరులు చెబుతున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలన్నారు. రోజు ముఖాలు చూసుకునేవాళ్లు.. ఇష్టం ఉన్నా, లేకున్నా ఇరుపక్షాలు ఊళ్లో కలిసే ఉండాలన్నారు. అన్ని మరిచిపోయి అందరూ కలిసివుండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. కాగా, ఈ బహిష్కరణ ఘటనలో ఎమ్మార్వోను, సెక్రటరీని సస్పెండ్ చేశారని, అంటే ఏదో తప్పు జరిగిందని జగన్ ఆరోపించారు.