షర్మిల లేకుండానే జగన్ 2వసారి: కారులోనే మంతనాలు
షర్మిల లేకుండా ఇడుపులపాయకు వెళ్లడం ఇది రెండోసారి! కోర్టు అనుమతితో జగన్ శనివారం, ఆదివారం కడపజిల్లాలో పర్యటించారు. శనివారం మొదట తండ్రికి నివాళులు అర్పించిన అనంతరం రెండు రోజుల పాటు భేటీలు జరిపారు. గత నెలలో జగన్ బెయిల్ పొందిన అనంతరం ఇడుపులపాయకు వెళ్లారు. అప్పుడు కూడా వెంట షర్మిల లేరు. జగన్ జైలులో ఉన్నప్పుడు షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన విషయం తెలిసిందే.
జగన్ జిల్లాలో ఓ వైపు సుడిగాలిలా పర్యటిస్తూనే మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన నేతలతో కారులోనే మంతనాలు జరిపారు. ముందుగా రూపొందించుకున్న షెడ్యూలు ప్రకారం నేతలు దగ్గరకు రాగానే కారులో ఎక్కించుకుని చర్చించారు. ఈ చర్చల్లో నిర్ణయాత్మకమైన విషయాలన్నీ ప్రస్థావనకు వచ్చినట్లు తెలుస్తోంది. సమైక్యాంధ్రకు సంబంధించి దేశ పర్యటన, ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై కీలకమైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికలకు సంబంధించి కడప జిల్లాలో అభ్యర్థుల జాబితాను ఖరారు చేశారట కూడా. ఇదే విధంగా మిగిలిన జిల్లాల జాబితాలను కూడా ఖరారు చేసి ఒకటి రెండు రోజుల్లో ప్రకటించాలని నిర్ణయించినట్లు సమాచారం. మొత్తం మీద ఇటు ఎన్నికల వ్యూహం, అటు సమైక్య ఉద్యమ పథకం కడప నుంచే అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
జగన్ ఆదివారం తన సతీమణి భారతిని వెంట పెట్టుకుని చర్చికెళ్లి తన కుటుంబ సభ్యులతో సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం తన కుటుంబ సభ్యులు వైయస్ మనోహర్ రెడ్డి, వైయస్ ప్రకాష్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి ఇళ్లకు వెళ్లారు. అనంతరం పులివెందుల, లింగాల మండలాల్లో సుడిగాలి పర్యటన చేశారు. అనంతరం రాత్రి ముద్దనూరులో రైలెక్కి హైదరాబాద్కు బయలుదేరారు.
అయితే ఈ పర్యటనలో తల్లి విజయమ్మ, జగనన్న వదిలిన బాణాన్నని చెప్పుకునే షర్మిల కనిపించకపోవడం చర్చనీయాంశమయింది. దీనిపై జగన్ కుటుంబలో కీలకమైన వ్యక్తులు స్పందిస్తూ వైయస్ బతికుండగా ఏనాడూ విజయమ్మ బయటకు రాని విషయం గుర్తు చేసుకోవాలన్నారు. వైయస్ మరణం తరువాత ఆయన అభిమానులకు కోసం ఎన్నికల బరిలోకి దిగారన్నారు. అలాగే జగన్ జైలులో ఉండడంతో కార్యకర్తల్లోనూ అభిమానులను మనోనిబ్బరం కలిగించడం కోసం విజయమ్మ పార్టీ పగ్గాలు అందుకోగా షర్మిల బయటకు వచ్చారని, ఇప్పుడు ఆ అవసరం లేదంటున్నారు.