20 ని.లు టైమిస్తే ఆధారాలు, లేదంటే బయటకెళ్లి చెప్తా: బాబుకు జగన్ హెచ్చరిక
వన్ సైడ్ చాలెంజింగ్ ఎక్కడా ఉండదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు అన్నారు. గతంలో తాను పలుమార్లు ఛాలెంజ్ చేసానని చెప్పారు.
అమరావతి: వన్ సైడ్ చాలెంజింగ్ ఎక్కడా ఉండదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు అన్నారు. గతంలో తాను పలుమార్లు ఛాలెంజ్ చేసానని చెప్పారు.
తమ పార్టీ నుంచి గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరారని చెప్పారు. వారిచే రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలని తాను సవాల్ చేశానని జగన్ గుర్తు చేశారు.
అసెంబ్లీలో తనను మాట్లాడనిస్తారనే నమ్మకం తనకు లేదని చెప్పారు. స్పీకర్ కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారని చెప్పారు. నేను చాలెంజ్ చేస్తే ప్రభుత్వం పారిపోతుందని ఎద్దేవా చేశారు.

మా ఛాలెంజ్పై రూలింగ్ ఇవ్వరా
సభలో ఒక్క చాలెంజ్కు రూలింగ్ ఇస్తారా, తమ ఛాలెంజ్లపై రూలింగ్ ఇవ్వరా అని ప్రశ్నించారు. దేనికైనా ధర్మం, న్యాయం ఉండాలన్నారు. సభాపతిని అడ్డు పెట్టుకొని పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా చూస్తున్నారన్నారు.
అనర్హత వేటు వేస్తే ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుందామన్న తన సవాల్కు ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఓటుకు నోటు కేసులో మనవాళ్లు బ్రీఫ్డ్ మి అనే వాయిస్ చంద్రబాబుదో, కాదో చెప్పాలని సవాల్ విసిరామని, దానిపై ఇప్పటి దాకా స్పందన లేదన్నారు.

కిరణ్ సర్కార్ రెడ్డిని కాపాడారు
ప్రతిపక్షం సవాళ్లపై స్పందించరని, అదే అధికార పక్షం సవాల్పై మాత్రం స్పందించాలని ఎదురు దాడి చేయడం సరికాదన్నారు. చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ కలిసి తనపై తప్పుడు కేసులు వేయించారన్నారు. అందుకే అవిశ్వాసం సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి సర్కారను చంద్రబాబు కాపాడారన్నారు.
తన ఆస్తి లక్ష కోట్లు అని ఓసారి, రూ.43వేల కోట్లు అని మరోసారి చెబుతున్నారని జగన్ అన్నారు. అందులో పది శాతం ఇవ్వాలని తాను సవాల్ చేస్తే ప్రభుత్వం పారిపోయిందన్నారు. తన సవాళ్లపై స్పందించేందుకు ఇంతవరకూ ఒక్కరు కూడా ముందుకు రాలేదన్నారు. మళ్లీ అవే ఆరోపణలు తనపై చేస్తున్నారన్నారు.
ఎప్పుడైనా వన్ సైడ్ ఛాలెంజ్ ఉండదన్నారు.
అధికార పార్టీ నేతలకు సంబంధించి అగ్రిగోల్డ్ బాధితులు తనకు చాలా సమాచారం ఇచ్చారని జగన్ తెలిపారు. సభలో వాటిని తాను బయటపెడతానని భయంతో మాట్లాడకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. వాస్తవాలు చెబుతుంటే మైక్ కట్ చేస్తున్నారన్నారు.

ఆధారాలతో మీడియాకు చెబుతా
సభలో తనను అడ్డుకున్నా టిడిపి నేతలు, ప్రభుత్వాన్ని వదిలి పెట్టే ప్రసక్తి లేదన్నారు. సాయంత్రం మీడాయ ఎదుట మొత్తం ఆధారాలతో సహా వెల్లడిస్తానని చెప్పారు. హాయ్ ల్యాండ్ ఆస్తులు ఎందుకు వేలానికి రాలేదన్నారు. యారాడ ప్రాపర్టీస్, షాపింగ్ మాల్స్ను ఎందుకు వేలంలో చేర్చలేదన్నారు.
అగ్రిగోల్డ్ బాధితులను ప్రభుత్వం మోసం చేసిందన్నారు. బాధితుల వద్దకు తాను వెళ్లి వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మృతులకు రూ.10 లక్షల చొప్పున చెల్లిస్తామని చెప్పానని అన్నారు. దీంతో ప్రభుత్వం రూ.5 లక్షలకు పెంచిందన్నారు.
సభలో తాను మాట్లాడిన ప్రతిసారి మైక్ కట్ చేస్తున్నారని చెప్పారు. అధికార సభ్యులు లేచి సభను దారి మళ్లిస్తున్నారన్నారు. అగ్రిగోల్డ్పై ప్రభుత్వాన్ని నిలదీయగానే నలభై రోజుల కిందట వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారన్నారు. ప్రజల గొంతు వినిపిస్తుంటే అడ్డుకుంటోందన్నారు.

20 నిమిషాల సమయమిస్తే ఆధారాలు చూపిస్తా
అగ్రిగోల్డ్ భూములపై విచారణ అడిగింది తామేనని, 20 నిమిషాల సమయం ఇస్తే తాము ఆధారాలు చూపిస్తామని జగన్ సభలో అన్నారు. లేదంటే బయటకు వెళ్లి మీడియాకు చెబుతానని అన్నారు.












Click it and Unblock the Notifications