వాళ్ళు పొత్తులతో వెళ్తే.. వాటిని చిత్తు చేసే ఎత్తులతో వెళ్తున్న వైఎస్ జగన్!!
ప్రతిపక్షాలు పొత్తులతో ముందుకు వెళ్తే వైఎస్ జగన్ వాటిని చిత్తు చేసే వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి కొనసాగుతుంది. ఇప్పటి నుంచే రాజకీయ పరిణామాలు ఏపీలో శరవేగంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఏ విధంగానైనా విజయం సాధించాలని అన్ని ప్రధాన పార్టీలు రకరకాల వ్యూహాలతో పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా ఈసారి జనసేన, టిడిపి పొత్తు ఖరారు అయినట్టుగానే అందరూ భావిస్తుంటే, వచ్చే ఎన్నికలకు సింగిల్ గా వెళ్తామని మళ్లీ విజయం సాధించి తీరుతామని రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి మరోమారు తేల్చి చెబుతుంది.

పొత్తులతో ప్రతిపక్షాలు.. సంక్షేమ పథకాలతో జగన్
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలన్నీ ఏకతాటి మీదికి రావలసిన అవసరం ఉందని, వైసిపి వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా చూడాల్సిన అవసరం ఉందని పదేపదే చెబుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇటీవల జనసేన ఆవిర్భావ దినోత్సవ రోజు చేసిన వ్యాఖ్యలలో కూడా పొత్తులకు సంబంధించిన క్లారిటీ ఇచ్చారు. దీంతో కచ్చితంగా వచ్చే ఎన్నికలలో పొత్తుతోనే జనసేన పార్టీ ముందుకు వెళుతుందని స్పష్టమైంది. అయితే ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా, సీఎం జగన్ మాత్రం వాటన్నింటినీ చిత్తు చేసే ఎత్తుగడలతో ముందుకు వెళుతున్నారు. ప్రజల మద్దతు సంపాదించడం కోసం సంక్షేమ పథకాలతో దూసుకు వెళ్తున్నారు.

పింఛన్ దారులకు జగన్ గుడ్ న్యూస్.. 3వేలకు వృద్ధాప్య పింఛన్ పెంపు
ఇక ఈ క్రమంలోనే తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పించన్ దారులకు గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే జనవరి నుంచి వృద్ధాప్య పెన్షన్లు 3000 రూపాయలకు పెంచాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలనుంచి స్పష్టమైన సంకేతాలు కూడా వస్తున్నాయి. దీనిపై అధికారికంగా కూడా ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక తాజా అసెంబ్లీ సమావేశాలలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ పెన్షన్ 3000 చేసిన తర్వాత ఎన్నికలకు వెళతామని చెప్పారు. ఏపీ తరహాలో దేశంలోనే పెన్షన్ అందిస్తున్న మరే రాష్ట్రం లేదని స్పష్టం చేశారు.

అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలతో చేరువవుతున్న జగన్
ఇప్పటికే అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన, వైయస్సార్ రైతు భరోసా, వైయస్సార్ కాపు నేస్తం, వైయస్సార్ లానేస్తం, వైయస్సార్ ఆదర్శం పథకం, వైయస్సార్ ఆరోగ్య ఆసరా, వైయస్సార్ కళ్యాణ కానుక, వైయస్సార్ నేతన్న నేస్తం, వైయస్సార్ వాహన మిత్ర, జగనన్న చేదోడు పథకం, జగనన్న తోడు పథకం, జగనన్న విద్యా దీవెన పథకం ఇలా అనేక పథకాలను వివిధ వర్గాల వారికి అందిస్తూ వారి మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి, సంక్షేమ మంత్రంతో సింగిల్ గా వచ్చే ఎన్నికలలో బరిలోకి దిగుతానని స్పష్టం చేస్తున్నారు.

పొత్తుల ఎత్తులను చిత్తు చేసే వ్యూహంలో జగన్
ప్రజా సంక్షేమమే మళ్ళీ వైసీపీకి పట్టం కడుతుందని బలంగా నమ్ముతున్నారు. తాను ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చానని, రాష్ట్రంలో నవరత్నాలను అమలు చేస్తున్నామని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో కచ్చితంగా ప్రజలందరూ తనను ఆశీర్వదిస్తారని జగన్ విశ్వసిస్తున్నారు. ఎవరెన్ని పొత్తులు ఎత్తులు వేసిన.. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలతో సంక్షేమ మంత్రంతో మళ్లీ ఏపీలో అధికారాన్ని చేజిక్కించుకుంటామని వైయస్ జగన్ ధీమాతో ఉన్నారు.












Click it and Unblock the Notifications