అలాచేస్తే జగన్ మటాష్, బాబును అణిచివేసే అస్త్రాలు, మోడీకి పెళ్లాం-పిల్లలు లేరు: ఉండవల్లి
Recommended Video

అమరావతి: వైసీపీ అధినేత వైయస్ జగన్ బీజేపీతో కలిస్తే ఆయన పని అయిపోయినట్లేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు సాధించలేకపోతున్న చంద్రబాబు సీఎంగా ఉండటం దురదృష్టకరమన్నారు. గత ఏడాదిన్నరగా చంద్రబాబుకు మోడీ అపాయింటుమెంట్ ఇవ్వడం లేదన్నారు.
ఏం చేయలేని నిస్సహాయస్థితిలో చంద్రబాబు ఉన్నారని ఎద్దేవా చేశారు. బల్లగుద్ది మోడీతో వాదించే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు లేకుంటే ఆంధ్రప్రదేశే లేదని, ఈ ప్రాజెక్టుకు ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఊహించలేకపోతున్నామన్నారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

బీజేపీతో కలిస్తే జగన్కు దూరం
మోడీ వద్ద చంద్రబాబు ఎందుకు తలొగ్గి బలహీనుడు అయ్యారో అసలు కారణం తెలియడం లేదని ఉండవల్లి అన్నారు. ఈ పరిస్థితి రావడం సిగ్గుచేటు అన్నారు. బీజేపీతో జగన్ కలిస్తే మటాష్ అయిపోతారన్నారు. ఆయనకు ఉన్న మైనార్టీ ఓటు బ్యాంకు దూరం అవుతుందని హెచ్చరించారు. 2014లో తొలుత జగన్ను సంప్రదించి, అక్కడ పొత్తు కుదరకే బీజేపీ.. టీడీపీ వైపు వెళ్లిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జగన్కు సలహా ఇచ్చే శక్తి లేదు
పొత్తుల విషయంలో జగన్కు సలహా ఇచ్చే శక్తి తనకు లేదని ఉండవల్లి అన్నారు. తనతో పాటు కేవీపీ రామచంద్ర రావు తదితర కాంగ్రెస్ నేతలు జగన్ను అధికారంలోకి తెచ్చేందుకు పావులు కదుపుతున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. జగన్ తమకు చిన్నప్పటి నుంచి తెలుసునని, ఆయన అంటే ప్రేమ ఉందని చెప్పారు.

జగన్ను అధికారంలోకి తెచ్చే సమర్థత లేదు
జగన్ తమకు తెలిసినప్పటికీ ఆయనను అధికారంలోకి తీసుకు వచ్చేంత సమర్థత తమ వద్ద లేదని ఉండవల్లి అన్నారు. అదే ఉంటే తానే అధికారంలో ఉండేవాడిని అని చెప్పారు. తనకు ఆ శక్తి, ఆసక్తి లేవని చెప్పారు. వైయస్ తమకు మిత్రుడైనంత మాత్రాన జగన్పై తమకు ప్రేమ ఉందని, చంద్రబాబును విమర్శిస్తుంటానని మాట్లాడటం అర్థరహితమన్నారు.

అమరావతిని నేను చూడలేను, బాబు 130 ఏళ్లు బతుకుతారేమో
చంద్రబాబు చూపిస్తున్న నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తాను చూడలేనని, జన్యుపరంగా అద్భుత నిర్మాణం కలిగి ఉండి ఆయన 130 ఏళ్లు బతుకుతారేమోనని ఉండవల్లి ఎద్దేవా చేశారు. రేపు ఏమవుతుందో ఎవరికీ తెలియదని, తాను ఎవరికీ కోచ్ను కాదని తేల్చి చెప్పారు. ఎన్నికల్లో ఎలా గెలవాలో తనకు తెలియదన్నారు. ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ.. కాంట్రాక్టులు, బిడ్డింగ్ ప్రక్రియ నుంచి కమీషన్లు తీసుకోవడం వరకు అంతా ఓ బ్రహ్మపదార్థం అని, దానిలో వేలుపెట్టని వాళ్లు ఉండరన్నారు. ప్రభుత్వంలోని వారికే తెలియకుండా ఉంటుందన్నారు. పోలవరం ప్రాజెక్టుపై బీజేపీ, టీడీపీలు బురదజల్లుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు.

జగన్ పాదయాత్ర గురించి ఆలోచించట్లేదు, బాబు సెల్ఫ్ గోల్
జగన్ పాదయాత్ర గురించి ఆలోచించడం లేదని, ఆ పాదయాత్ర ఆయనను ముఖ్యమంత్రి పీఠం వరకు తీసుకు వెళ్తుందా లేదా కూడా తెలియదని, ఆ విషయమై చెప్పే మూడ్ లేదని ఉండవల్లి అన్నారు. పోలవరం విషయంలో చంద్రబాబు సెల్ఫ్ గోల్ చేసుకున్నారని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసు వంటి వాటికి భయపడే చంద్రబాబు రాజీ పడి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. ఆ విషయం మరుగునపడ్డాక ఇప్పుడు చేసిన అప్పులకు లెక్కలు చెప్పలేక భయపడుతున్నారన్నారు. చంద్రబాబు నోరును బీజేపీ మరోసారి నొక్కేసిందన్నారు. బీజేపీ నేతలు తిడుతున్నా మెతక వైఖరి అవలంభిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు అంటూ బీజేపీని ఏమీ అనవద్దని తమ పార్టీ నేతలకు చంద్రబాబు చెబుతున్నారన్నారు.

కేంద్రం వద్ద బాబును అణిచివేసే ఆయుధాలు
చంద్రబాబు పదింటిలో మూడు నెగ్గి, ఏడు ఓడినా ఓకే అనవచ్చు, కానీ ఆయన ఎక్కడ నెగ్గాడో చెప్పాలని ఉండవల్లి ప్రశ్నించారు. కేంద్రం నియమించిన గవర్నర్ ఉండగా చంద్రబాబు హైదరాబాద్ నుంచి వెళ్లిపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఎవరన్నా శంకుస్థాపన రోజునే కాపురం మార్చేస్తారా అని ప్రశ్నించారు. కేంద్రంపై బాబుకు పట్టు లేదన్నారు. చంద్రబాబును ఎప్పటికి అఫ్పుడు అణిచివేసే ఆయుధాలు కేంద్రం వద్ద ఉన్నాయన్నారు.

మోడీకి పెళ్లాం, పిల్లలు లేరు
నరేంద్ర మోడీ హైదరాబాదులో కాలుపెడితే అరెస్టు చేయిస్తానని గతంలో చంద్రబాబు అన్నారని ఉండవల్లి గుర్తు చేశారు. ఏ కాంగ్రెస్ పార్టీ సీఎం కూడా మోడీపై అలాంటి పరుషపదాలు వాడలేదన్నారు. మోడీకి పెళ్లాం, పిల్లలు లేరని, కేవలం రాజకీయమే తెలుసునని, మోడీని ఏం చేయాలన్నా చంద్రబాబు వద్ద ఏం లేదని, ప్రధానిపై అవినీతి ఆరోపణలు కూడా లేవని, కానీ మనకేమో ఒళ్లంతా ఛార్జీలేనని ఉండవల్లి ఎద్దేవా చేశారు. అందుకే చంద్రబాబు భయపడుతున్నాడా అని ప్రశ్నించారు. మోడీ, అమిత్ షాలు అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారని, ఏపీపై వాళ్లకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదన్నారు.












Click it and Unblock the Notifications