పాదయాత్రకు ముందు జగన్ కీలక అడుగులు: వరుస భేటీలు
అమరావతి: నవంబర్ 2 నుంచి పాదయాత్రను ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక అడుగులు వేస్తున్నారు. సోమవారం బీసీ సంఘాలతో జగన్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు.
అన్ని సంఘాలతో..
బీసీ, బడుగు, బలహీన వర్గాల నేతలతోపాటు ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలతోనూ జగన్ సమావేశం అవుతారని సమాచారం. అంతేగాక, రాష్ట్రంలో 50శాతానికిపైగా జనాభా ప్రాతినిథ్యమున్న బీసీల సంక్షేమం, వారి అభ్యున్నతి, అందుతున్న సంక్షేమ పథకాలు, తదుపరి దశలో తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై వివిధ వర్గాల సంఘాల నేతలతో భేటీ కానున్నారు.
అండగా ఉంటామని..
ఈ భేటీల సందర్భంగా బీసీలకు అండగా తమ పార్టీ ఉంటుందన్న భరోసాను కల్పించే దిశగా బీసీ డిక్లరేషన్ను కూడా రూపొందించనున్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.
అదే లక్ష్యం..
రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల పరిస్థితి, వారి సమస్యలను గుర్తించడంతోపాటు పరిష్కార మార్గాల అన్వేషణ తదితరాలను చర్చించేందుకు ఈ సమావేశం జరగనుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొన్నారు. అన్ని వర్గాల వారి అభిప్రాయాలను సేకరించడమే జగన్ లక్ష్యమని, పాదయాత్రకు ఈ సమావేశం ఉపకరిస్తుందని తెలిపారు.
పాదయాత్రలో మార్పులు..
అన్ని జిల్లాల నుంచి బీసీ నేతలు ఈ సమావేశానికి వస్తుండటంతో, జగన్ పాదయాత్రకు జన సమీకరణ తదితరాలపై నేతలకు దిశానిర్దేశం చేయవచ్చని తెలుస్తోంది. నేతల కోరిక మేరకు పాదయాత్ర మార్పులపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.