బాబు మనవడితో ఆడుకోలేకపోతున్నాడు, ఎప్పటికీ సీఎంవి కాలేవ్: జగన్కు జెసి
అనంతపురం: తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా నేత, పార్లమెంటు సభ్యులు జెసి దివాకర్ రెడ్డి మంగళవారం నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన నిప్పులు చెరిగారు. జగన్ తీరు మార్చుకోకుంటే ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడని మండిపడ్డారు.
అనంతపురం జిల్లాలో చేపట్టిన నీరు - ప్రగతి కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఎంపీ జెసి దివాకర్ రెడ్డి కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన జగన్ పైన నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు చెడ్డపేరు తేవాలన్న ఒకే లక్ష్యంతో జగన్ పని చేస్తున్నారని ఆరోపించారు.
రాయలసీమకు నీళ్లు వద్దంటే జగన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడని విమర్శించారు. ఈ సందర్భంగా జగన్ పైన జెసి శాపనార్థాలు పెట్టారు. మంచి పనులు చేస్తే జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశముందన్నారు. కానీ పొద్దున లేచిన దగ్గర నుంచి చంద్రబాబును తిట్టేందుకే జగన్కు సమయం సరిపోవడం లేదన్నారు.
జగన్ తన సమయాన్ని అంతటీని చంద్రబాబును తిట్టేందుకే ఉపయోగిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు విజన్ ఉన్న వ్యక్తి అని కొనియాడారు. రాయలసీమకు శ్రీశైలం నుంచి నీళ్లు తెచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.
అందరికీ మనుమడు, మనవరాళ్లతో ఆడుకోవాలని సరదాగా గడపాలని ఉంటుందని, కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం వాటిని పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిత్యం పాడుపడుతున్నారని చెప్పారు.