చంద్రబాబు లేఖ ఇస్తే జగన్ సంతకం: వాసిరెడ్డి పద్మ
చంద్రబాబుతో టిడిపి నాయకులు కేంద్రానికి సమైక్యం కోసం లేఖ రాయించాలని ఆమె అన్నారు. జగన్ సమైక్య సభ పెడుతుంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తోందని ఆమె ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు సమైక్య ద్రోహులని ఆమె విమర్శించారు. మంత్రుల బృందం వద్దకు వెళ్లడమంటే విభజనను అంగీకరించడమేనని వాసిరెడ్డి పద్మ అన్నారు.
కాంగ్రెసు పార్టీ అధిష్టానం కుట్రలో భాగంగానే ముఖ్యమంత్రి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపించారని, ఆ కుట్రలో భాగంగానే మళ్లీ ఉద్యమాన్ని విరమింపజేశారని ఆమె విమర్శించారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి వచ్చే ఎన్నికల్లో తగిన సన్మానం చేస్తారని ఆమె వ్యంగ్యంగా అన్నారు.
సోనియాకు సవాల్ విసరడానికే లక్ష, మందితో హైదరాబాదులో సమైక్య సభ పెడుతున్నామని ఆమె చెప్పారు. సమైక్య ఉద్యమంపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేయడం మానుకోవాలని ఆమె సూచించారు.