తండ్రి కార్డును పక్కన పెట్టి జగన్: బాబు ప్రత్యర్థిగా పవన్ కల్యాణ్
ఎపిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. జగన్ తన సొంత ఇమేజ్తో రంగంలోకి దిగితే, చంద్రబాబుకు ప్రత్యర్థిగా పవన్ కల్యాణ్ విజృంభిస్తున్నారు.
విజయవాడ: ఎన్నికలకు ఇంకా చాలా గడువు ఉండగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. 2019లో జరిగే ఎన్నికల కోసం రాజకీయ నాయకులు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తూ కత్తులు దూసుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీలు, కులాల వారీగా రాష్ట్రంలో రాజకీయాలు రాజుకుంటున్నాయి.
ముగ్గురు నేతలను ఎదుర్కోవడంలో అధికార తెలుగుదేశం పార్టీ మునిగిపోయింది. ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ తన తండ్రి కార్డును పక్కకు పెట్టి, సొంత ఇమేజ్తోనే చంద్రబాబు ప్రభుత్వంపై సమరభేరీ మోగిస్తున్నారు. ఉభయ కమ్యూనిస్టులు చెరో దారి ఎంచుకుంటున్నట్లు కనిపిస్తున్నారు.
జగన్కు సిపిఎం మిత్రపక్షంగా మారగా, జనసేన అధిపతి పవన్కల్యాణ్కు సిపిఐ మిత్రపక్షంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ టిడిపితో తెగదెంపులు చేసుకుని శుత్రపక్షంగా మారుతున్నారు. మరోవైపు కాపునాడు నేత ముద్రగడ పద్మనాభం కూడా రిజర్వేషన్ల అంశంపై చంద్రబాబు ప్రబుత్వాన్ని చిక్కుల్లో పడేయడానికి పూనుకున్నారు.
ఆ చీలిక ముద్రగడకు సవాల్
తాజాగా కాపు ఉద్యమంలోనూ చీలిక చోటు చేసుకుంది. ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. బలిజలు వేరుబాట నడిచి, ముద్రగడ నాయకత్వాన్ని సవాలు చేస్తున్నారు. దీంతో ఉద్యమాలు, ఆందోళనలు, రాజకీయ ఎదురుదాడులతో రాష్ట్ర రాజకీయ వాతావరణం ఎన్నికలకు ముందే వేడిక్కింది. తమపై కాపుల ఆధిపత్యం సాగుతోందని వారు ఆరోపిస్తున్నారు. తాము కాపుల ఆధిపత్యాన్ని సహించబోమని అంటున్నారు. ఈ పరిణామం చంద్రబాబుకు ఉపయోగపడుతుందా, లేదంటే జనసేనకు గానీ జగన్కు గానీ ఉపయోగపడుతుందా అనేది ఇప్పుడే తేల్చలేం.
దూకుడు ప్రదర్శిస్తున్న జగన్
ప్రధాన ప్రతిపక్షమైన వైసిపి అధినేత జగన్ జనంలోకి దూసుకుపోతూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక హోదాపైనే కాకుండా ఇతర అంశాలపై కూడా ఆయన దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ సమస్య తలెత్తితే అక్కడికి వెళ్లి బాధితులను పరామర్శిస్తున్నారు. కాపుల ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ముద్రగడకు పార్టీపరంగా మద్దతు ప్రకటించడం ద్వారా, టిడిపి శత్రుపక్షాలను ఏకం చేసే వ్యూహంతో జగన్ వెళుతున్నారు. వైసీపీకి సిపిఎం కూడా తోడవడంతో ప్రజా ఉద్యమాలు మరింత ఊపందుకుంటున్నాయి.
తండ్రి కార్డు లేకుండా జగన్...
గత ఎన్నికల్లో తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి సానుభూతి కార్డుతో 67 సీట్లు సాధించిన జగన్ ఇప్పుడు ఆ కార్డు అవసరం లేకుండా, సొంతగానే ఎదుగుతుండటం కీలకమైన పరిణామంగా చెప్పవచ్చు. చంద్రబాబు వ్యతిరేక శక్తులను కూడగట్టడంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న జగన్కు, పార్టీలో బాగా మాట్లాడే బొత్స సత్యనారాయణ, రోజా, అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డివంటివారు ఉండడం ప్లస్పాయింట్గా మారింది.
జగన్ మొండి పోరాటం...
చాలా మొండిగా చంద్రబాబు ప్రభుత్వం పోరాడుతున్న తీరు ఆటకట్టుకుంటోంది. ప్రభుత్వం కూడా జగన్, ఇతర నాయకులు సంధిస్తున్న ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం జగన్పై అవినీతి ఆరోపణలు చేస్తూ కొట్టేసే ప్రయత్నాలు ఇంక ఎంత మాత్రం కూడా పనికి వచ్చే పరిస్థితి లేదు. అధికార టిడిపి తన దృష్టంతా వైసిపి మీదనే సారించింది. నియోజకవర్గాల్లో వైసీపీకి తగినంత యంత్రాంగం లేకున్నా, కేవలం జగన్ ఆకర్షణ మీదే పార్టీ బలోపేతం అవుతుండటం టిడిపిని ఆలోచనలోకి నెట్టేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్లు ఉన్నప్పటికీ వారిలో ప్రతిపక్షంపై ఎదురుదాడి చేయటంలో విఫలమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. పేరుకు మంత్రులున్నా ఎక్కువ మంది జగన్పై సాధికారికంగా ఎదురు దాడి చేయలేకపోతున్నారనే మాట వనిపిస్తోంది.
పవన్ కల్యాణ్పై అస్పష్ట వైఖరి
ప్రతిపక్ష నేతగా మారిన పవన్కల్యాణ్పై ఎలాంటి వైఖరి ప్రదర్శించాలనే విషయంపై చంద్రబాబు ఇంకా స్ఫష్టమైన వైఖరి తీసుకున్నట్లు కనిపించడం లేదు. దాంతో పార్టీ నాయకుల్లో కాస్తా అయోమయం నెలకోంది. ప్రస్తుతానికి పవన్ కల్యాణ్ పట్ల అనుసరిస్తున్న తన మెతక వైఖరికి తెరదించి, విపక్షనేత పాత్ర పోషిస్తున్నారు. చంద్రబాబుపై నేరుగా విమర్శలు చేస్తూ జగన్కు పోటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఫలితంగా చంద్రబాబుకు ఆయన సవాల్ విసురుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
పవన్ కల్యాణ్ పోరాటాలు ప్రారంభిస్తే..
పవన్ కల్యాణ్ కూడా జగన్ స్థాయిలో పోరాటాలు ప్రారంభిస్తే అప్పుడు పోటీ జగన్ - పవన్ మధ్యనే ఉండే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఆయన అందుకు సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు. బాధితులు పవన్ దగ్గరకు వస్తుండటం, ఆయన ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయటం, వెంటనే ప్రభుత్వం స్పందించి దానిని పరిష్కరిస్తుండటంతో ప్రజలు సహజంగానే పవన్ కల్యాణ్ను ప్రతిపక్షంగా గుర్తించే అవకాశాలున్నాయి. అయితే, ప్రత్యేక హోదా వంటి విషయాల్లో పవన్ కల్యాణ్ డిమాండ్లను పరిష్కరించే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. దీంతో చంద్రబాబు పవన్ కల్యాణ్ను కూడా ఎదుర్కోవడానికి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.
బలమైన మీడియా ఉండడం..
కాపు ఉద్యమం వల్ల, ప్రతిపక్ష నేత చేతిలో బలమైన మీడియా ఉండడం వల్ల చంద్రబాబుకు చిక్కులు తప్పడం లేదు. దానికి తోడు ప్రజాఉద్యమాలు చెలరేగుతున్నాయి. పెట్టుబడులు తీసుకురావడం, కొత్త రాజధాని నిర్మాణం, ప్రభుత్వ హామీల వంటి విషయాల్లో మీడియాను కూడా వాడుకుంటూ చంద్రబాబుపై తీవ్రమైన వ్యతిరేక ప్రచారం సాగుతోంది. జగన్, పవన్ కల్యాణ్ క్షేత్ర పర్యటనల్లో, మీడియా ద్వారా చేస్తున్న విమర్శలు, సంధిస్తున్న ప్రశ్నలు ఓ వైపు ఉంటే, సాక్షి మీడియా చేస్తున్న వ్యతిరేక ప్రచారం మరో వైపు ఉంది. దీంతో చంద్రబాబుకు ఇక్కట్లు తప్పేట్లు లేవు.
ముద్రగడకు సమాంతర నేతగా ఎవరు...
ముద్రగడకు సమాంతరమైన నేతలను తయారుచేయడంలో చంద్రబాబు విఫలమైనట్లు కనిపిస్తున్నారు. ఆ కోణంలో పదవులిచ్చిన వారుకూడా ముద్రగడపై ఆశించిన స్థాయిలో ఎదురుదాడి చేయక చేయడం లేదనే మాట వినిపిస్తోంది. కాపు మంత్రులు ముద్రగడను ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నా ఫలితం అంతగా కనిపించడం లేదని అంటున్నారు. చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ముద్రగడ గతంలో టిడిపికి మద్దతుగా నిలిచిన కాపులను తన వైపు తిప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు.
ముద్రగడకు వైఎస్ జగన్ సాయం..
తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిన కాపులను తమ వైపు తిప్పుకునే ముద్రగడ ప్రయత్నానికి వైసిపి మద్దతు ఇస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అది జగన్కు ఉపయోగ పడే అవకాశం ఉందని అంటున్నారు. అందువల్లనే టిడిపి నాయకులు జగన్కు ముద్రగడకు లింక్ పెడుతూ విమర్శలు చేస్తున్నారు. ముద్రగడ వ్యవహారం ప్రభుత్వానికి సవాలుగానే మారింది. అయితే, కాపుల్లో చీలిక ఇప్పుడు చంద్రబాబుకు ఉపయోగపడుతుందా అనే చూడాల్సిన విషయం. లేదంటే పవన్ కల్యాణ్కు ప్రయోజనం చేకూరుస్తుందా అనేది ఇప్పుడే చెప్పలేం.