ఫలించిన జగన్ వ్యూహం ? ఇండీ కూటమి పార్టీల క్యూ-ఢిల్లీలో సీన్ రివర్స్..!
ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం అండతో వైసీపీ కార్యకర్తలు, నాయకుల లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. వీటిపై రాష్ట్రంలోనే ఉంటూ నిన్న మొన్నటివరకూ విమర్శలు గుప్పించిన వైసీపీ.. ఇవాళ మాత్రం ఢిల్లీ వేదికగా నిరసనకు దిగింది. దీనికి జాతీయ పార్టీల్ని ఆహ్వానించింది. అయితే ఇన్నాళ్లూ మోడీ సర్కార్ కు అండగా నిలిచిన జగన్ కు మద్దతుగా ఇండీ కూటమి పార్టీలు కానీ, అలాగే ఏపీలో టీడీపీ-జనసేనతో అధికారం పంచుకుంటున్న ఎన్డీయే పార్టీలు కూడా రావని అంత భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. వైసీపీ ధర్నాకు ఇండీ కూటమి పార్టీలు మద్దతిచ్చాయి.
ఇండియా కూటమిలో భాగంగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆ పార్టీ ఎంపీ రాంగోపాల్ యాదవ్, శివసేన(యూబీటీ) ఎంపీలు సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నదీముల్ హక్, ఐయూఎంఎల్ ప్రతినిధులు అబ్దుల్ వాహబ్, హ్యారిస్, ఎఐఎడిఎంకే రాజ్యసభ ఎంపీ చంద్రశేఖర్ వైసీపీ శిబిరానికి హాజరై మద్దతు ప్రకటించారు. దీంతో జగన్ పార్టీ సంతోషంలో మునిగిపోయింది. ప్రస్తుతం ఎన్డీయే, ఇండీ కూటమికి దూరంగా ఉన్న వైసీపీకి ఇండీ కూటమి నుంచి ఈ స్ధాయిలో మద్దతు ఎన్డీయే కూడా ఊహించలేదు.

ఇవాళ ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాలు రెండు సంకేతాలను ఇచ్చాయి. అందులో తాజాగా లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకే ఇవ్వాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన డిమాండ్, ఇవాళ ధర్నాతో ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉన్నట్లు వైసీపీ ఇచ్చిన సంకేతం ఉన్నాయి. డిప్యూటీ స్పీకర్ పోస్టును విపక్షాలకే ఇవ్వాలంటూ వైసీపీ చేసిన డిమాండ్ ప్రభావంతోనే ఇవాళ ఇండీ కూటమి పార్టీలు జగన్ ధర్నాకు హాజరై మద్దతు తెలిపినట్లు సమాచారం. అయితే ఇండీ కూటమిలో కీలకమైన కాంగ్రెస్ మాత్రం ఈ ధర్నాకు దూరంగా ఉండిపోయింది. దీంతో ఎన్డీయే ఊపిరిపీల్చుకున్నట్లయింది.













Click it and Unblock the Notifications