జగన్ను కాంగ్రెసు ఆడిస్తోంది: బాబు నోట ఎన్టీఆర్
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసు పార్టీపై తీవ్రంగా ధ్వజమెత్తారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెసు ఆడిస్తోందని ఆయన అన్నారు. జగన్ సూట్కేసుల కంపెనీలు కోల్కతాలో ఉన్నాయని, సాక్షులను ప్రభావితం చేస్తాడని అన్న సిబిఐ జగన్ కోల్కతా పర్యటన విషయంలో మౌనంగా ఉండిపోయిందని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో గుర్తు చేశారు.
వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితిలతో రాజకీయం చేస్తూ కాంగ్రెసు అధిష్టానం విభజనకు పూనుకుందని ఆయన అన్నారు. 371డి, హైదరాబాద్ వంటి అంశాలను తేల్చకుండా కేంద్ర ప్రభుత్వం విభజన విషయంలో ఎలా ముందుకు సాగుతుందని ఆయన అడిగారు. కేంద్రం మిథ్య అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాల విషయంలో ఎన్టీ రామారావు చెప్పిన మాటలను చంద్రబాబు గుర్తు చేశారు. విభజన కేవలం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది మాత్రమే కాదని, దేశానికి సంబంధించిందని ఆయన అన్నారు. రాష్ట్రాలను విశ్వాసంలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
విభజనపై రోజుకో మాట చెబుతూ కేంద్ర మంత్రులు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్, గవర్నర్ నరసింహన్ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. గవర్నర్ నరసింహన్ కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ను కలిశారని, మనోహర్ పార్టీ వ్యక్తిగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే ప్రజలు తిరుగుబడతారని ఆయన హెచ్చరించారు. గతంలో రాష్ట్రాల విభజన ఏకాభిప్రాయంతోనే జరిగిందని ఆయన గుర్తు చేశారు. రెండు వైపులా ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించిన తర్వాతనే రాష్ట్రాన్ని విభజించాలని తాను సూచించినట్లు చంద్రబాబు తెలిపారు.
విద్వేషాలను రెచ్చగొడుతూ అభద్రతా భావం పెంచుతున్నారని ఆయన అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని సవరించాలని జగన్ అనడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.