ఏపీలో టైమ్ పాస్ సర్కార్: షర్మిల నోట..
YS Sharmila: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు సంధించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం తీరును ఎండగట్టారు.
శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ గారి ప్రసంగం పూర్తిగా సత్యదూరమని షర్మిల విమర్శించారు. ప్రజల అంచనాలకు భిన్నంగా 30 మోసాలు, 60 అబద్ధాలు అనే సామెతను తలపించిందంటూ ఎద్దేవా చేశారు. గవర్నర్తో సైతం అబద్ధాలు చెప్పించారని, కూటమి కరపత్రాన్ని చదివించారని ఆరోపించారు.

అరచేతిలో వైకుంఠం చూపించడం తప్ప మ్యానిఫెస్టో హామీల అమలుపై ఎక్కడ కూడా చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయలేదని షర్మిల అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలలు దాటినా ఇచ్చిన హామీలు అమలు కావట్లేదని, అవి ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పట్లేదని గుర్తు చేశారు.
సూపర్ సిక్స్ పథకాలపై ప్రభుత్వానికే క్లారిటీ లేనే లేదని మండిపడ్డారు షర్మిల. జాబ్ క్యాలెండర్ లాంటి మిగతా హామీల గురించి అసలు గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావనే లేదని అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం అంటూ కాలయాపన తప్ప.. పథకాలను అమలు చేస్తారని ఎదురుచూస్తున్న ప్రజలకు గవర్నర్ ప్రసంగం తీవ్ర నిరాశను మిగిల్చిందని ఆమె వ్యాఖ్యానించారు.
6.5లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలు చెప్పారని షర్మిల విమర్శించారు. నాలుగు లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించామంటూ అభూత కల్పన సృష్టించారని పేర్కొన్నారు. తొలి సంతకం పెట్టిన మెగా డీఎస్సీ భర్తీ చేయకుండా ఉద్యోగాలు ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకున్నారని ధ్వజమెత్తారు.
ఆరోగ్య శ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యా, వైద్య రంగాలను ఉద్ధరించినట్లు అసత్యాలు పలికారని షర్మిల చెప్పారు. గిట్టుబాటు ధర లేక, ప్రకృతి విపత్తులతో రైతులు తీవ్రంగా నష్టపోతే, రాష్ట్ర రైతాంగం సుభిక్షంగా ఉందని చెప్పడం శుద్ధ అబద్ధం. జలయజ్ఞం కింద చేపట్టిన దాదాపు 30 ప్రాజెక్టులు దశాబ్ద కాలంగా మూలుగుతుంటే వాటిని పూర్తి చేసే చిత్తశుద్ది కూడా కూటమి ప్రభుత్వానికి లేదని చెప్పారు.
3,000 రూపాయల నిరుద్యోగ భృతి కోసం 50 లక్షల మంది యువత.. 84 లక్షల మంది విద్యార్థులు తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్నారని షర్మిల పేర్కొన్నారు. ఎకరానికి 20,000 వేల రూపాయలు ఇచ్చే అన్నదాత సుఖీభవ పథకం కోసం 54 లక్షల మంది రైతులు ఎదురు చూస్తోన్నారని చెప్పారు.
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, నెలకు 1,500 రూపాయలు ఇచ్చే మహాశక్తి పథకం కోసం కోటి మంది మహిళలకు ఎదురుచూపులు తప్పట్లేదని, పేదవాళ్లకు సొంత ఇంటి కోసం చేపట్టిన టిడ్కో ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడం లేదని షర్మిల ధ్వజమెత్తారు.
అందుకే ఈ నెల 28న ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రజల ఆశయాలకు అద్దంపట్టేలా ఉండాలని, సూపర్ సిక్స్ హామీలను ఈ ఏడాది నుంచే అమలు చేసేలా నిధులు కేటాయించాలని, జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ వైఎస్ షర్మిల.. చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications