జగన్ లేఖకు షర్మిల ఘాటు రిప్లై.. తల్లి, చెల్లిపై కేసుపెట్టి అధఃపాతాళానికి కూరుకుపోయావ్!
వైయస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిలల మధ్య ఆస్తి పంచాయతీ పీక్స్ కు చేరింది. ఇటీవల జగన్ షర్మిలకు రాసిన లేఖకు కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఘాటుగా బదులిచ్చారు. వైఎస్ జగన్ కారణంగా ఆస్తుల పంపకం విషయంలో తనకు జరిగిన అన్యాయాన్ని ఆమె అందులో ప్రస్తావించారు. వైయస్ జగన్ మాట తప్పారని మడమ తిప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధః పాతాళానికి కూరుకుపోయారు
తండ్రి ఆదేశాలను, అభిమతాన్ని గారికి వదిలేసారని ఆ లేఖలో అసహనం వ్యక్తం చేశారు. జగన్ నైతికంగా దిగజారిపోయారని తన పైన తల్లి విజయమ్మ పైన కేసు పెట్టి అధః పాతాళానికి కూరుకుపోయారని వైయస్ షర్మిల విమర్శించారు. ఇప్పటికైనా తండ్రికి ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకుంటారని, మనమధ్య కుదిరిన ఒప్పందానికి కట్టుబడి ఉంటారని ఆశిస్తున్నానని షర్మిల ఆ లేఖలో పేర్కొన్నారు.

ఆస్తుల విషయంలో నాన్న ఆదేశం ఇలా
ఇప్పటికి కూడా జగన్ మారకుంటే ఎప్పటికీ ఇలాగే ఉండాలి అనుకుంటే తన హక్కులను కాపాడుకోవడం కోసం చట్టపరంగా ముందుకు వెళతానని వైయస్ షర్మిల స్పష్టం చేశారు. జగన్ కు రాసిన లేఖలో వైయస్ షర్మిల ప్రియమైన జగనన్నా.. మీరు ఇటీవల రాసిన లేఖ పట్ల తీవ్ర అభ్యంతరం తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. నాన్న రాజశేఖర్ రెడ్డి తన జీవితకాలంలో సంపాదించిన ఆస్తులన్నీ నలుగురు మనవళ్ళు, మనవరాళ్ళకు సమానంగా చెందాలని ఆదేశించారన్నారు.
ఆస్తుల విషయంలో చర్చలు, ఒప్పందాలకు తల్లి విజయమ్మ సాక్షి
అప్పట్లో ఆదేశాలను మీరు అంగీకరించారని గుర్తుచేశారు .ఆయన మరణించిన తర్వాత మీరు మాట తప్పారని తండ్రికి ఇచ్చిన హామీని గంగలో కలిపారని షర్మిల పేర్కొన్నారు. భారతి సిమెంట్స్, సాక్షి పత్రికలతో పాటు తన జీవితకాలంలో సంపాదించిన ఆస్తులు అన్నింటిని మన తండ్రి అందరికీ సమానంగా చెందాలని ఆదేశించారని అయితే ఇప్పటివరకు అలా జరగలేదన్నారు. మన మధ్య జరిగిన చర్చలు, సంప్రదింపులు, ఒప్పందాలకు తల్లి విజయమ్మ సాక్షి అని షర్మిల పేర్కొన్నారు.
తోడబుట్టిన అన్నతో వివాదం ఇష్టం లేక..
సాక్షి, భారతి సిమెంట్స్ లో మెజారిటీ వాటాలు మీరే ఉంచుకున్నారని, సొంత అన్నతో వివాదం ఇష్టం లేక ఆస్తిలో సమాన వాటా పొందేందుకు నాకున్న హక్కును వదులుకునేందుకు అంగీకరించానని పేర్కొన్నారు. 2019 ఆగస్టు 31న కుదిరిన ఒప్పందాన్ని అమలు చేసేందుకు కూడా మీకు మనసు రావడంలేదని సొంత చెల్లెలికి, పిల్లలకు చెందాల్సిన ఆస్తుల్ని వారికి దక్కకుండా చేయడానికి కంకణం కట్టుకున్నారన్నారు .
సొంత తల్లిపై కేసు పెట్టే స్థాయికి దిగజారారు
దీనికోసం సొంత తల్లి పైన కూడా కేసు పెట్టే స్థాయికి మీరు దిగజారారని షర్మిల విమర్శించారు. మీరు రాసిన లేఖ చట్టప్రకారం ఒప్పందానికి విరుద్ధంగా ఉందని, అంతేకాదు మీరు లేఖ రాయడం వెనుక దురుద్దేశం నన్ను చాలా బాధించిందని షర్మిల లేఖలో పేర్కొన్నారు. ఇక తన రాజకీయ జీవితం తనదని, నా వృత్తిపరమైన వ్యవహార శైలి ఎలా ఉండాలో చెప్పే అధికారం మీకు లేదని షర్మిల తేల్చి చెప్పారు.
తను ఏం చేయాలో నిర్దేశించే హక్కు మీకు లేదు
ఇక బహిరంగ వేదికలపై మీకు, ఎంపీ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడకూడదని నిబంధనపై నన్ను సంతకం చేయమని కోరడం అసంబద్ధం అంటూ పేర్కొన్న షర్మి,ల తన జీవితం ఎలా ఉండాలో తను ఏం చేయాలో నిర్దేశించే హక్కు మీకు లేదన్నారు. మీరు నాన్న ఎప్పుడూ కలలో కూడా ఊహించని పని చేశారని, ఆయన ఎంతో ప్రేమగా చూసుకున్న భార్య, కుమార్తెపైన కేసులు పెట్టారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
కుటుంబాన్ని రచ్చ కీడ్చడం పద్ధతి కాదు
ఇక సరస్వతి పవర్ లోని షేర్లు ఎంవోయూలో నా వాటాగా పేర్కొన్న వాటిపై సంతకం చేసిన వెంటనే నాకు బదలాయిస్తానని హామీ ఇచ్చారని, ఒప్పందం జరిగి సంవత్సరాలు గడిచినా ఆ హామీ నెరవేరలేదని మండిపడ్డారు. ఆ షేర్లను వదులుకోవడానికి అంగీకరించిన తర్వాత ఇప్పుడు మళ్లీ అనవసర వివాదాలు లేవనెత్తుతూ కుటుంబాన్ని రచ్చ కీడ్చడం పద్ధతి కాదని వైయస్ షర్మిల ఆ లేఖలో పేర్కొన్నారు. జగన్ షర్మిలకు రాసిన లేఖకు ఘాటుగానే వైయస్ షర్మిల బదులిచ్చారు.












Click it and Unblock the Notifications