మహిళలకు ఫ్రీ బస్సుపై చంద్రబాబు యూటర్న్ ? షర్మిల ఫైర్..!
ఏపీలో గత ఎన్నికల్లో గెలిచేందుకు కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని జిల్లాలకే పరిమితం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న వార్తలు వచ్చాయి. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి దృష్ట్యా ఈ పథకంలో భాగంగా జిల్లాల్లో ప్రయాణం మాత్రమే ఉచితంగా కల్పించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోందన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు.
ఏరు దాటేంత వరకు ఓడ మల్లన్నా, దాటాక బోడి మల్లన్నలా కూటమి ప్రభుత్వ తీరు ఉందని షర్మిల ఆరోపించారు.
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ..ఫ్రీ అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టి, ఓట్లు వేయించుకొని, ఇప్పుడు కండీషన్ అప్లై అనడం దారుణమన్నారు. జిల్లా స్థాయి వరకే పథకాన్ని పరిమితం చేస్తామని చెప్పడం మోసమే అన్నారు. చేయాలన్న చిత్తశుద్ది లేక చెప్పే సాకులు అని షర్మిల మండిపడ్డారు. ఆదిలోనే యూటర్న్ తీసుకోవడం అంటే ఇదే మరి అన్నారు.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 9 నెలలు దాటినా ఉచిత ప్రయాణం కల్పించకుండా మహిళలను మోసం చేశారని, కమిటీల పేరుతో కాలయాపన చేశారని గుర్తుచేశారు. రాష్ట్రాల పర్యటన పేరుతో విహార యాత్రలు చేశారని, పథకం అమలుకు ముందే ఇన్ని నిబంధనలు పెట్టే ఈ ప్రభుత్వం.. రేపు అమల్లోకి తెచ్చే సరికి నియోజక వర్గం, మండల స్థాయి వరకే ఫ్రీ అంటారేమో అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ...మహిళలకు రాష్ట్రమంతా ఉచిత ప్రయాణమే అన్నారు. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఎక్కడినుంచి ఎక్కడికైనా అంతా ఉచితమే అని గుర్తుచేశారు.
ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఎంతదూరమైనా జీరో టికెట్ అన్నారు. ఇలాంటి మంచి పథకాన్ని, అతి తక్కువ ఖర్చుతో మహిళలకు మేలు జరిగే హామీని .. అమలు చేయడానికి కూటమి ప్రభుత్వానికి ఇంకా మనసు రావడం లేదన్నారు. నెలకు రూ.350 కోట్లు మహిళల కోసం ఆర్టీసికి ఇవ్వడానికి ధైర్యం చాలడం లేదన్నారు. మహిళలకు భద్రత కల్పించే విషయంలో కూడా లాభనష్టాలు చూడాలా ? అని షర్మిల ప్రశ్నించారు. ఇదేనా కూటమి ప్రభుత్వం కల్పిస్తున్న మహిళా సాధికారిత అన్నారు. తక్షణం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని..రాష్ట్రం అంతా ఉచిత ప్రయాణం సౌకర్యం ఉండాలని..
రాష్ట్రంలోని మహిళల పక్షాన కూటమి ప్రభుత్వాన్ని షర్మిల డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications